ఆర్మూర్, మే 2 : దేశంలో ఏ పంటకూ లేనంత డిమాండ్ ఆయిల్పామ్కు ఉన్నదని రాష్ట్ర ఉద్యానవన, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ఆయిల్పామ్ నర్సరీని రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి, రాష్ట్ర ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే డిసెంబర్ నాటికి 2 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు సాగవుతాయన్నారు. మరో 2 లక్షల ఎకరాల్లో రైతుల నుంచి ఆయిల్పామ్ తోటల సాగుకు డిమాండ్ ఉన్నట్లు చెప్పారు. ఆయిల్పామ్ సాగుతో రైతులకు అధికంగా లాభాలు వస్తాయని తెలిపారు.
ఎకరం విస్తీర్ణంలో 57 ఆయిల్పామ్ మొక్కలను నాటుకోవచ్చన్నారు. నాలుగేండ్లలో పంట దిగుబడి వస్తుందన్నారు. అంతర పంటగా మెట్ట పంటలు సాగు చేసుకోవచ్చన్నారు. ఆయిల్పామ్ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు. ఒక్క మొక్కకు రైతు రూ.20 చెల్లిస్తే రాష్ట్రప్రభుత్వం సబ్సిడీ కింద రూ.280 చెల్లిస్తున్నదని చెప్పారు. రైతులకు బైబ్యాక్ సౌకర్యం ఉందని, కంపెనీలే నేరుగా పంట దిగుబడులను కొనుగోలు చేస్తాయని తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో ఆయిల్పామ్ పంటకు టన్నుకు రూ.15వేలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. వరికి బదులుగా ఆయిల్పామ్ పంటను సాగు చేసి అధిక లాభాలు పొందాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో 55 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ పంట సాగు చేయించాలనే లక్ష్యాన్ని అధికారులు పెట్టుకున్నట్లు చెప్పారు.
ఇప్పటి వరకు 4,065 ఎకరాల్లో 1,333 మంది రైతులు పంటను సాగు చేసేందుకు ముందుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. మరో 435 మంది రైతులు 1540 ఎకరాల్లో డ్రిప్ విధానంలో సాగు చేసేందుకు ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్లు చెప్పారు. అంతకుముందు మంత్రి నిరంజన్రెడ్డికి చేపూర్ సర్పంచ్ సాయన్న పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. మం త్రి వెంట రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్దాస్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మేకల గోవింద్, ఎంపీటీసీ బాల్నర్సయ్య, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ బదావత్ మంజుల, ఉద్యానవన శాఖ అధికారులు సుమన్, రోహిత్, సంధ్యరాణి, వహీద్, ప్రియాంక, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్, సీఈవో సత్యనారాయణ, డిప్యూటీ జనరల్ మేనేజర్ రామ్మోహన్రావు, జిల్లా ఏరియా మేనేజర్ గంగాధర్, నర్సరీ మేనేజర్ లోకేశ్, తహసీల్దార్ వేణుగోపాల్గౌడ్, ఎంపీడీవో గోపీబాబు, సీఐ శ్రీధర్, ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు.