విద్యానగర్/ ఇందూరు, మే 2 ;నెలవంక మెరిసింది. రంజాన్ పండుగ వచ్చేసింది. పుణ్యఫలాల పవిత్ర రంజాన్ మాసం 30 రోజుల ఉపవాస దీక్షలు.. షవ్వాల్ మాసం నెలవంక కనిపించడంతో ముగిశాయి. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లిములు సోమవారం సాయంత్రం విరమించి రంజాన్ పండుగను జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం ఈద్-ఉల్-ఫితర్ నిర్వహించేందుకు మసీదులను ముస్తాబు చేశారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాల నుంచి ముస్లిములు ఇంటి వద్దనే రంజాన్ వేడుకలు జరుపుకొన్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఘనంగా ప్రార్థనలు నిర్వహించేందుకు మసీదులు, ఈద్గాల వద్ద ఏర్పాట్లు చేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ పట్టణాల్లో షాపింగ్ సందడి నెలకొన్నది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ముస్లిములతో మార్కెట్లు కిటకిటలాడాయి.
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
ఖలీల్వాడి, మే 2: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ముస్లిములకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షల పుణ్యఫలంతో రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని కోరారు. నెలరోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమైన ముస్లిములు అదే స్ఫూర్తితో మంగళవారం ప్రార్థనలు చేయాలని తెలిపారు.