విద్యానగర్, మే 2 : ‘మన ఊరు -మన బడి’ మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలలకు ఈ నెల 10వ తేదీలోగా ప్రతిపాదనలు పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి వారు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద గుర్తించిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రూ.30 లక్షల విలువైన పనులకు ఈ నెల 15వ తేదీలోగా ప్రతిపాదనలు పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. 30లోగా పనులను పూర్తిచేయాలని సూచించారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో మన ఊరు -మన బడి కార్యక్రమం కింద 351 పాఠశాలలు ఎంపికయ్యాయని, ప్రతిపాదనలు త్వరితగతిన తయారు చేయిస్తామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో వెంకటేశ్ దోత్రే, డీఈవో రాజు, ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’కి 64 ఫిర్యాదులు
విద్యానగర్, మే 2 : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి సమీకృత కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రెవెన్యూశాఖకు 37, డీఎంహెచ్వోకు ఒకటి, డీపీవోకు ఎనిమిది, ఎలక్ట్రిసిటీకి రెండు, మున్సిపల్ శాఖకు రెండు, డీఆర్డీవోకు రెండు, ఎస్సీ డెవలప్మెంట్కు ఒకటి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు ఏడు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు నాలుగు ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. కార్యక్రమంలో జడ్పీసీఈవో సాయాగౌడ్, కలెక్టర్ ఏవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.