నిజాంసాగర్, ఏప్రిల్ 27 : మండలంలోని మహ్మద్నగర్ గ్రామంలో దళితబంధు లబ్ధిదారులకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దళితబంధు పథకం ద్వారా గొర్రెలు, మేకలు, బర్రెలు అందుకోనున్న లబ్ధిదారులు వాటి పో షణ సక్రమంగా నిర్వహించి ఆర్థికంగా బలోపేతం కావాలని దళితబంధు రాష్ట్ర పరిశీలకుడు లక్ష్మారెడ్డి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. ముందుగా లబ్ధిదారులకు గడ్డి పెంపకంపై అవగాహన కల్పించారు. అనంతరం వాటి పోషణ విధానంపై అధికారుల ద్వారా లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. త్వరలో గొర్రెలు, బర్రెలు, మేకల యూనిట్లు అందజేయనున్నామని ఆ లోపు షెడ్లను వేసుకోవాలని సూచించారు. గొర్రెలు, మేకల షెడ్డు కోసం రూ. లక్షా 90వేలు, బర్రెల కోసం రూ. లక్షా 50వేలు మంజూరు చేయనున్నామని తెలిపారు.
ముందుగా గడ్డి విత్తనాలను తీసుకువచ్చి సిద్ధం చేసుకోవాలని కోరారు. దళితబంధు పథకం ద్వారా వచ్చే యూనిట్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని, వాటి సంరక్షణ కోసం అధికారుల సూచనలు సలహాలు స్వీకరించాలని కోరారు. వారితో పాటు ప్రత్యేకాధికారి జగన్నాథాచారి, తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో పర్బన్న, సర్పంచ్ బాలమణి, నాయకులు వాజీద్అలీ, విజయ్ ఉన్నారు.