కామారెడ్డి/ విద్యానగర్, ఏప్రిల్ 24: పదో తరగతిలో మంచి గ్రేడ్ సాధించాలంటే ఇంటర్నల్ మార్కులు కీలకంగా మారాయి. మార్కులు కేవలం ఆయా పాఠశాలల యాజమాన్యాల చేతిలో ఉండడంతో.. వారి విద్యార్థులు మంచి గ్రేడ్ సాధించేందుకు ప్రతిభను గుర్తించకుండానే వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ అధికారులు 36 ప్రత్యేక బృందాలతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రతిభ ఆధారంగా మార్కులు వేశారా? లేదా ? అని ఆరా తీశారు. ఫార్మెటీవ్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులను పరిశీలించారు. దీంతో ప్రైవేటు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నిర్వాహకులు తమకు నచ్చినట్లుగా మార్కులు వేసే అవకాశం లేకుండా అడ్డుకట్ట పడింది.
పదో తరగతిలో గ్రేడ్లు సాధించాలంటే ఇంటర్నల్ మార్కులు కీలకం. ఆ మా ర్కులు ఆయా పాఠశాలల యాజమాన్యాల చేతుల్లో ఉండడంతో కొందరు వాటిని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న విద్యాశాఖ అధికారులు పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. రెండేండ్లుగా ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా పైచదువులకు పంపించారు. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో పరీక్షలను నిర్వహిస్తుంది. దీంతో ఎలాంటి ఆగడాలు జరగకుండా విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకున్నది. ఆయా ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతిభ ఆధారంగా మార్కులు వేస్తున్నారా ?లేదా ? అని ఆరా తీసింది.
పరిశీలన ఇలా..
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1011 ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలుండగా 291 పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులున్నారు. ఇందులో 186 ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 19 కేజీబీవీలు, 13 తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, రెండు ఎయిడెడ్ పాఠశాలలు, ఆరు మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలలు, 52 ప్రైవేటు పాఠశాలలు, మహాత్మా జ్యోతిబాఫూలే వెల్ఫేర్ పాఠశాలలు నాలుగు, మూడు తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ఆరు మోడల్ స్కూళ్లు ఉన్నాయి. విద్యార్థులకు మెరుగైన గ్రేడ్ రావాలంటే ఫార్మెటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ)లో ఆరు సబ్జెక్టుల్లో వచ్చే 120 మార్కులే కీలకం. వీటిల్లో హెచ్చుతగ్గులు అయితే గ్రేడ్లలో భారీ తేడా కనిపించనున్నది.
వీటిని ఫార్మెటివ్ అసెస్మెంట్ ద్వారా అంచనా వేసి ప్రతి విద్యార్థికి 20 మార్కుల్లోపు కేటాయించి. ఆన్లైన్లో ఎస్సెస్సీ బోర్డుకు సమర్పిస్తారు. వార్షిక పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ మార్కులను జోడించి ఫలితాలను వెల్లడిస్తుంది. ఈ మార్కులే కీలకం కావడంతో ఎలాంటి అవకతవకలు జరుగకుండా విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందుకోసం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటైన 36 ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలను తనిఖీ చేశాయి. విద్యార్థులు ఫార్మెటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో సాధించిన మార్కులను పరిశీలించి ప్రతిభ ఆధారంగానే ఇంటర్నల్ మార్కులు వేశా రా? లేదా? అని తనిఖీ చేశాయి. ప్రాజెక్టులు, రికార్డులు సహా ఏడాదంతా ఆయా సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహించి వేసిన మార్కులను పరిశీలించారు.
పకడ్బందీగా తనిఖీలు..
కామారెడ్డి జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్ మార్కుల విషయంలో 36 బృందాల ద్వారా తనిఖీలు నిర్వహించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాలు పాఠశాలలను సందర్శించాయి. కామారెడ్డిలో పలు విద్యా సంస్థల తీరు విచిత్రంగా ఉంది. అధిక మార్కులు వచ్చేందుకు బట్టీ చదువులవైపు విద్యార్థులను మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇంటర్నల్ మార్కులు బట్టీ చదువుల ద్వారా కాకుండా పరిజ్ఞానం ద్వారానే గుర్తించాల్సి ఉంటుంది.
ప్రతి అంశంపై విద్యార్థి ఎలా స్పందించాడో తెలుసుకుంటారు. బట్టీకి బట్టి జవాబులు ఎక్కిస్తే… మార్కులు వచ్చే అవకాశమే కనిపించదు. పైగా విద్యార్థి చేతిరాతకు, రికార్డుల నిర్వహణకూ మార్కులుంటాయి. దీంతో ప్రతిభ ఉన్న విద్యార్థులకు మేలు జరిగాలన్నదీ ప్రభుత్వ సంకల్పం. ఈ వ్యవహారంలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు గుట్టుచప్పుడు కాకుండా ఎక్కువ మార్కులు వేసుకుంటున్నట్లుగా విద్యాశాఖ ఇప్పటికే గుర్తించింది. ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిపుణుల బృందాలు తనిఖీలు చేశాయి.