కామారెడ్డి, ఏప్రిల్ 24: సీఎం కేసీఆర్ను విమర్శించే స్థాయి ఈటల రాజేందర్కు లేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. కేసీఆర్ భిక్షతో రాజకీయంగా ఎదిగిన ఈటల, ఏనుగు రవీందర్రెడ్డి, తుల ఉమ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ర్టానికి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయానికి గురిచేస్తున్నదని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం లో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలుచేయడంలేదని ప్రశ్నించారు.
వడ్లు కొనుగోలు చేస్తామని ప్రకటన చేసిన బీజేపీ నాయకులు మాట తప్పారని మండిపడ్డారు. రాష్ర్టాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని అన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. వారు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే రాజకీయ యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. తాడ్వాయి, గాంధారి మం డలాల్లో శనివారం పర్యటించిన ఈటల విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆయనకు కేసీఆర్ దయవల్లే రెండుసార్లు మంత్రి పదవులు వచ్చాయన్నారు. బీసీ నేతగా ఉన్న ఈటల రాజేందర్ను పార్టీ ఫ్లోర్ లీడర్గా కూడా అవకాశం ఇచ్చారన్నారు.ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమకు కేసీఆర్ భిక్ష వల్లే పదవులు వచ్చాయని గుర్తు చేశారు. ఈ ముగ్గురు వార్డు సభ్యులుగా కూడా గెలువలేరన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గుర్తుకు రాని కుటుంబ పార్టీ ఇప్పుడు గుర్తుకు వస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు అనుభవించిన ముగ్గురు నేతలు ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం, కుటుంబంపై మాట్లాడడం తగదన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ చేసింది శూన్యమన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామని కోరుకుంటున్నారని అన్నా రు. సమావేశంలో నాగిరెడ్డిపేట, తాడ్వాయి జడ్పీటీసీలు మనోహర్ రెడ్డి, కొండ హన్మాండ్లు, రామారెడ్డి ఎంపీపీ నారెడ్డి దశరథ్రెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్ ఎన్. కపిల్ రెడ్డి, సదాశివనగర్ మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు, టీఆర్ఎస్ గాంధారి మండల అధ్యక్షుడు సత్యంరావు, సింగిల్ విండో చైర్మన్ మర్రి సదాశివరెడ్డి పాల్గొన్నారు.