నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి దాతలు, పూర్వ విద్యార్థులు చేయూతనందిస్తున్నారు. ఇందులోభాగంగా నిజామాబాద్ రూరల్ మండలం కాలూ ర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1979లో చదువుకున్న కాలేపల్లి క్యాంప్ నివాసి నిమ్మగడ్డ రామకృష్ణారావు రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆదివా రం తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు రూ.10లక్షల చెక్కును అందజేశారు. పాఠశాలకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు మురళీధర్ మృతి చెందగా, బాధిత కుటుంబానికి రూ.లక్షా 8వేల చెక్కును రామకృష్ణారావు అందించారు.
ఈ సందర్భంగా పూర్వవిద్యార్థి రామకృష్ణారావును అదనపు కలెక్టర్ అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడాల్సిన బాధ్యతను ప్రతిఒక్కరూ గుర్తించాలని కోరారు. పూర్వ విద్యార్థి రామకృష్ణారావు అందించిన విరాళం నుంచి పాఠశాల అభివృద్ధి కోసం నిధులను వెచ్చించి అకౌంట్ వివరాలు స్పష్టంగా తెలుపాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పెద్ద మొత్తంలో విరా ళం అందించిన రామకృష్ణారావు జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని కోరారు.
తల్లి జ్ఞాపకార్థంగా విరాళం : నిమ్మగడ్డ రామకృష్ణారావు
తన తల్లి జ్ఞాపకార్థంగా తాను చదివిన పాఠశాల అభివృద్ధి కోసం రూ.10లక్షలు విరాళంగా అందించే అవకాశం లభించడం తనకెంతో సంతృప్తినిచ్చిందని రామకృష్ణారావు తెలిపారు. కాలూర్ జడ్పీ, ప్రైమరీ పాఠశాలల్లో చదువుతున్న బాలికల సంక్షేమం కోసం తన భార్య వేతనం నుంచి అవసరమైనన్నీ డబ్బులు వెచ్చించేందుకు ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతకుముందు రామకృష్ణారావు తన తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంఈవో రామారావు, నుడా డైరెక్టర్ ముస్కె సంతోష్, కార్పొరేటర్ లలితా గంగాధర్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, నిమ్మగడ్డ శ్రీనివాస్రావు, నిమ్మగడ్డ కుటుంబీకులు, బంధువులు, హెడ్మాస్టర్లు సుహాసిని, సుధాకర్రెడ్డి, పీఆర్టీయూ నాయకులు వెంకటేశ్వర్గౌడ్, గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.