విద్యానగర్, ఏప్రిల్ 23:అన్ని ఉన్నా సాయం చేసేందుకు కొందరికి చేతులు రావు. తన వద్ద డబ్బులు ఉంటే తన అవసరాలకే తీర్చుకుంటాడే తప్ప పేదవారి కోసం ఖర్చు చేసే వారు చాలా తక్కువ. కానీ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నరేశ్ వీడ్కోలు సమావేశం కోసం జమ చేసుకున్న డబ్బులతో ఎవరికైనా సాయం చేద్దామనే ఆలోచనతో తన స్నేహితులు 40మందితో పంచుకున్నాడు. దీంతో స్నేహితులంతా కలిసి 2013 నవంబర్ 26న ‘సైన్యసేన’ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. రోడ్లపై భిక్షాటన చేసే వారు మిగిలింది మాత్రమే తింటున్నారని.. వారు కూడా అందరిలాగే వేడి పదార్థాలు తినాలనే ఉద్దేశంతో సైన్యసేనానిని ఏర్పాటు చేశారు. మొదట్లో అందరూ కలిసి ప్రతి నెలా రూ.500 పోగు చేసుకొని పేద వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ స్నేహితులు ఇతర దేశాలకు, జీవితాల్లో స్థిరపడడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో డబ్బులు జమచేయలేదు. కానీ ఎర్రోళ్ల నరేశ్ అనే వ్యక్తి మాత్రం తన ప్రయాణం ఆగకూడదని సొంత డబ్బులతో ఇంట్లోనే వండి సుమారు 150 నుంచి 200 మందికి అన్నం పెడుతున్నాడు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాడు. ప్రతి రోజూ 1500 నుంచి 2000 రూపాయల ఖర్చు పెడుతూ పేదవారి ఆకలి తీరుస్తున్నాడు.
మొబైల్ షాపు నడుపుతూ..
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నరేశ్ మొబైల్ షాపును నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పేదల ఆకలి తీర్చేందుకు సంకల్పించిన ఆయన.. తాను జమచేసుకున్న డబ్బులతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో పేషంట్లకు,వారి కోసం వచ్చే బంధువులకు ఉచితంగా అన్నం పెట్టేవాళ్లు.
ఇతర సేవల్లోనూ..
కేవలం భోజనం సహాయం చేయడమే కాకుండా రక్తదానం చేస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. రాజకీయ నాయకులు, సినిమా హీరోల పుట్టినరోజు సందర్భంగా సైన్యసేన సభ్యులు రక్తదానం చేస్తుంటారు. అంతటితో ఆగకుండా అత్యవసర సమయంలో ఎవరైనా రక్తం కావాలని సంప్రదించినా, సైన్యసేన సభ్యులకు తెలిసినా వెంటనే రక్తదానం చేస్తారు. ఇప్పటివరకు కడప, కర్నూల్, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ఇలా ఎన్నో ప్రాంతాలకు వెళ్లి రక్తదానం చేశారు. రోడ్లపై ఉండే అనాథలను గుర్తించి ఆశ్రమాలకు తీసుకెళ్లడం, బట్టలు కొనివ్వడం, వృద్ధులకు దుప్పట్లు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు.
భోజనంతోపాటు టోకెన్..
దవాఖానకు వచ్చే వారు, రోగులు ఒకే బాత్రుం వాడడంతో ఎలాంటి రోగాలు లేని వారు రోగాల బారినపడే అవకాశం ఉన్నది. ప్రత్యామ్నాయంగా సులభ్ కాంప్లెక్స్ను వాడుకునేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భోజనంతోపాటు ఒక టోకెన్ ఇచ్చి సులభ్ కాంప్లెక్స్ను ఉచితంగా వాడుకునేలా రెండు రూపాయల భోజనాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి మరుగుదొడ్లు కేవలం పేషంట్స్కే పరిమితమయ్యాయి. కరోనా సమయంలో కొవిడ్ బాధితులకు, రోడ్లపై ఉన్న వారి వద్దకు వెళ్లి స్వయంగా ఆహార పొట్లాలను అందజేశారు.
నిస్వార్థంగా సేవ చేయడమే లక్ష్యం..
నిస్వార్థంగా సేవ చేయడమే ‘సైన్యసేన’ లక్ష్యం. పేదల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఈ సైన్యసేనాను ఏర్పాటు చేశాం. కులమతాలకు అతీతంగా రెండు రూపాయలకు భోజనం అందించడం, రక్తదానం చేయడం, పేదలకు బట్టలు కొనివ్వడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.
–ఎర్రోళ్ల నరేశ్, సైన్యసేన ఫౌండర్