నిజామాబాద్, ఏప్రిల్ 23, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేసేందుకు భారత ఎన్నికల సంఘం (సీఈసీ) చర్యలు చేపట్టింది. డబుల్ ఓట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఒకరికి ఒకే ఓటు నిబంధనను పటిష్టంగా అమలు చేసేందుకు సమాయత్తమైంది. దీంతో ఉమ్మడి జిల్లాలో సుమారు 18 వేలకు పైగా బోగస్ ఓట్లు తొలిగించే అవకాశముంది. కొందరికి వేర్వేరు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉంది. ఉద్యోగులు, పిల్లల చదువుల రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు అక్కడ కూడా ఓటరుగా పేరు నమోదు చేసుకుంటున్నారు. అప్పటికే వారికి స్వస్థలాల్లో ఓటు హక్కు ఉంటుంది. ఇలా ఒకరికి రెండు, మూడుచోట్ల ఓటు హక్కు ఉండడంతో మొత్తం ఓటర్ల సంఖ్యలో తేడాలు బహిర్గతమవుతున్నాయి. దీన్ని నివారించేందుకు సిద్ధమైన సీఈసీ.. సరికొత్త సాఫ్ట్వేర్ను తీసుకొచ్చింది. ఫొటో సిమిలార్ ఎంట్రీస్ సాఫ్ట్వేర్ సాయంతో డబుల్ ఓట్లను గుర్తించి, వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది.
పల్లెటూరుకు చెందిన సురేశ్ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా పట్టణానికి వలస వచ్చాడు. ఇతనికి గతంలోనే తన సొంతూరులో ఓటు హక్కు ఉంది. కొత్తగా సిటీకి రావడంతో ఇక్కడ కూడా ఓటరుగా పేరు నమోదు చేసుకున్నాడు. కొద్ది రోజులకు మరోచోటికి బదిలీ కావడం, అదే సమయానికి ఎన్నికలు రావడంతో అక్కడా ఓటరుగా పేరు నమోదు చేయించాడు. దీంతో సురేశ్ ఒక్కడికే మూడు చోట్ల ఓటు హక్కు ఉంది. ఇలాంటి వాటిని భారత ఎన్నికల సంఘం (సీఈసీ) తొలగించే పనిలో పడింది. ఒక్కొక్కరికి ఉన్న డబుల్, ట్రిపుల్ ఓట్లను తొలగించి, ఒకరికి ఒకే ఓటు అన్న నిబంధనను అమలు చేయనుంది. ఇందుకోసం ఫొటో సిమిలార్ ఎంట్రీస్ సాఫ్ట్వేర్ను వినియోగిస్తోంది.
తొలగించే పనిలో..
డబుల్ ఓట్ల సమస్యను గుర్తించిన భారత ఎన్నికల సంఘం.. వాటిని ఏరివేసేందుకు కార్యాచరణను మొదలు పెట్టింది. దీని కోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్వేర్ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెవెన్యూ అధికారులు ఈ రకమైన డబుల్ ఓట్లను తొలగించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఫొటో సిమిలార్ ఎంట్రీస్ అనే సాఫ్ట్వేర్ను వినియోగించి ఫొటోల ఆధారంగా డబుల్ ఓట్లను గుర్తిస్తున్నారు. ఒకే రకమైన ఫొటో, పేరు, ఇంటి పేరు, తండ్రి పేరును సరి చూస్తున్నారు. చిరునామాలు వేర్వేరుగా ఉండి ఒకే రకమైన వ్యక్తిగత సమాచారం ఉంటే బోగస్ ఓటుగా నిర్ధారిస్తున్నారు.
పేరు, పుట్టిన తేదీతో పోలిక..
ప్రతి ఒక్కరూ ఫొటో ఆధారితంగానే ఓటరుగా నమోదు అవుతున్నారు. సీఈసీ వెబ్సైట్లోనూ ఓటరుగా నమోదు కావాలంటే తప్పనిసరిగా ఫొటో అప్లోడ్ చేయాల్సిందే. అయితే, డబుల్ ఓట్లను గుర్తించేందుకు ఫొటో సిమిలార్ ఎంట్రీస్ సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఫొటో ఆధారంగా ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓట్లు ఉండే వారి వివరాలను గుర్తిస్తారు. ఫొటోలో ఉన్న వ్యక్తిని పోలిన ఓటర్ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీతో సరి పోల్చడం ద్వారా బోగస్ ఓటా.. కాదా? అన్నది తేలుతుంది.
చిరునామాలు వేర్వేరుగా ఉండి వ్యక్తిగత సమాచారం ఒకటే మాదిరిగా ఉంటే బోగస్ ఓటుగానే పరిగణించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇలా డబుల్ ఓటు ఉన్న వారందరినీ గ్రామాలు, వార్డుల వారీగా విభజిస్తారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఫొటోలతో సహా వచ్చిన ఆ జాబితాను తహసీల్దార్ కార్యాలయాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. ఓటరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఓటు ఉండేలా ఆదేశాలుండడంతో రెండింటిలో ఒక చోట ఓటు తొలగిస్తున్నారు. ఈ పరిశీలన ఈ నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉండడంతో తొలగింపు ప్రక్రియ చకచకా చేపడుతున్నారు.
18వేల బోగస్ ఓట్లు..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 19,39,662 మంది ఓటర్లున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు (నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, బాల్కొండ, ఆర్మూర్, బాన్సువాడ) కలిపి 13.15 లక్షల మంది ఓటర్లుండగా, ఇందులో 6,23,233 మంది పురుషులు, 6,91,793 మంది మహిళా ఓటర్లున్నారు. కామారెడ్డి జిల్లాలో మూడు నియోజకవర్గాలు (కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్) కలిపి 6.24 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో 3,03,883 మంది పురుషులు, 3,20,753 మంది మహిళా ఓటర్లున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం 2022, జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పిస్తూ ఓటరు తుది జాబితాను జనవరి 5న వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం బోగస్ ఓట్ల గుర్తింపు చేపట్టారు. ఇందులో ప్రాథమిక సమాచారం మేరకు ఉభయ జిల్లాల్లో 18వేల డబుల్ ఓట్లు ఉన్నట్లుగా తేలింది. వీటి తొలగింపుపై ఈసీ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
బోగస్ ఓట్లకు కారణాలు
ఒకరికి ఒకే ఓటు ఉండాలనేది సీఈసీ నిబంధన. ఇకనుంచి ఈ నిబంధనను పటిష్టంగా అమలు చేయనున్నారు. నివాసాలు మార్చడం వల్ల చాలా మందికి రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. ముఖ్యంగా పల్లెల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్న వారితో డబుల్ ఓట్ల సమస్య వెంటాడుతుంది. పిల్లల విద్యాభ్యాసం, ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలు తిరిగే వారికి ఒకటికి మించి ఓటు హక్కు కలిగి ఉండడం ఇప్పుడో పెద్ద సమస్యగా మారింది. పట్టణాలు, నగరాల్లో సొంత ఇండ్లు నిర్మించుకుని జీవిస్తున్న వారికి సొంత గ్రామాల్లో ఓటు హక్కు ఉండడంతోపాటు ఇటు పట్టణాల్లోనూ ఓటరు జాబితాలో పేరుంది.
కొందరు అటు పల్లెటూర్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఇటు పురపాలక సంఘాల ఎన్నికల్లో ఓటు వినియోగించుకుంటున్న దాఖలాలు సైతం ఉన్నాయి. 2019లో కామారెడ్డి జిల్లాలో ఈ రకంగా ఓ వ్యక్తి రెండుసార్లు ఓటు వేయడం ద్వారా కేసు కూడా నమోదైంది. కొందరికి రెండేసి వార్డుల్లో ఓటు ఉంటోంది. మరోపక్క అద్దెకు నివాసముండే వారు ఇతర చోటికి మారడంతో వారికి ముందున్నచోట, కొత్తగా అద్దెకు మారిన చోట జాబితాలో పేరు ఉండడంతో రెండు ఓట్లు ఉంటున్నాయి. ఇలాంటి వారిని గుర్తించేందుకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టడంతో బోగస్ ఓట్లు అన్ని తొలగిపోనున్నాయి.