డిచ్పల్లి, ఏప్రిల్ 23:నీళ్లు.. నిధులు.. నియామకాల్లో జరుగుతున్న దోపిడీ పూర్తిగా పోవాలంటే.. స్వరాష్ట్రం సిద్ధించాలి. అందుకోసమే పురుడు పోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడుగడుగునా ప్రశ్నించిన టీఆర్ఎస్.. ఊరూరా పోరు సల్పి, ఉద్యమం లేవదీసింది. పోరాటాల ఫలితంగా జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ మంజూరైంది.
వీ వాంట్ జస్టిస్… ప్రభుత్వం దిగి రావాల్సిందే.. యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందే… అంతవరకు తగ్గేదేలే… ఇవీ రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా వినిపించిన డిమాండ్లు. కొన్ని సంవత్సరాల పాటు సాగిన ఈ పోరాటంలో అడుగడుగునా అప్పటి ప్రభుత్వానికి ఎదురైన నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాల్లో రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు కీలకపాత్ర పోషించాయి. ఈ పోరాటంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పురుడుపోసుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధాన భూమిక పోషించారు.
ఫలితంగా అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగుతున్న ఆందోళనలు, రాస్తారోకోలు, పోరాటాలకు తలొగ్గి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు వర్సిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వెరసి 2006 సెప్టెంబర్ 16న ఇందూరు నగరంలో తెలంగాణ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. అందుకు సాగిన ఉద్యమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు ప్రధానపాత్ర పోషించారని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
టీఆర్ఎస్ కీలకపాత్ర..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉస్మానియా సహా కొన్ని సంస్థలు, వరంగల్ నగరంలో కాకతీయ విశ్వవిద్యాలయం తప్ప తెలంగాణ ప్రాంతంలో మరో ఉన్నత విద్యాసంస్థ లేనే లేదు. దీంతో డిగ్రీలు పూర్తి చేసే విద్యార్థులకు పీజీలు, ఆపై చదువులు చదివేందుకు అవకాశం లేకుండేది. తెలంగాణ ప్రాంతంలో మరో ఉన్నత విద్యా సంస్థ ఉండాలనేది ఇక్కడి మేధావులు, విద్యార్థులు, రాజకీయ నాయకుల అభీష్టం. అందుకు పోరాటం ఒక్కటే శరణ్యమనుకున్నారు. వెనువెంటనే టీఆర్ఎస్ నాయకులకు తోడు విద్యార్థి సంఘాలు జతకలిశాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వరంగల్ తర్వాత ప్రధానమైన నిజామాబాద్లో ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఉవ్వెత్తున ఉద్యమాలు సాగాయి. ఈ ఉద్యమాల్లో టీఆర్ఎస్ నాయకులు అలుపెరుగని పోరాటం చేశారు. దీంతో ఇందూరు నగరంలోని ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ విశ్వవిద్యాలయం తొలుత ఆరు కోర్సులతో ఆరంభమయ్యే నాటి వరకు ఉమ్మడిగా పోరాటం సాగించారు.
ఆ ఇద్దరిదీ ప్రధాన పాత్ర..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందేనని సాగుతున్న ఉద్యమాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కేశ్పల్లి గంగారెడ్డి, మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్న ప్రస్తుత రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ముందున్నారని చాలా మంది చెబుతుంటారు.
దిగివచ్చిన వైఎస్ఆర్..
ఉన్నత ఆశయం కోసం సాగిన పోరుకు తలవంచిన అప్ప టి సీఎం, దివంగత వైఎస్సార్ దిగి వచ్చి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద పునాదిరాయి వేశారు. ఆ వెంటనే డిచ్పల్లికి ఆనుకొని ఉన్న సుమారు 570 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాజిరెడ్డి గోవర్ధన్ తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు కోసం సాగిన ఉద్యమాల్లో ప్రధాన పాత్ర పోషించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, విద్యార్థి సంఘాల నాయకులకు వెన్నుదన్నుగా ఉంటూ ఉద్యమాన్ని నడిపించారు. ఏ నిరసన చేయాలన్నా, ఎలాంటి ఆందోళన చేపట్టాలన్నా వాటిలో నాయకులకు, కార్యకర్తలకు కేశ్పల్లి, బాజిరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆందోళనల్లో పోలీసులు అరెస్టు చేసిన వారిని చెర నుంచి విడిపించడంలో ప్రధాన పాత్ర పోషించారు.
అందరి మేలు కోరే చేశాం..
విద్యార్థులు, నిరుద్యోగుల మేలు కోసమే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేశాం. అప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ పోరాడుతున్నది. వారి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాటం సాగించాం.. యూనివర్సిటీ సాధించాం. ఆదిలాబాద్, మెదక్, నిజామా బాద్ ఉమ్మడి జిల్లాలకు మేలు జరిగింది.
–శ్రీనివాస్గౌడ్, విద్యార్థి సంఘ నాయకుడు
పోరాట ఫలితమే టీయూ..
విద్యార్థులు, రాజకీయ నేతల పోరాట ఫలితంగానే తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడింది. ఉన్నత విద్యనభ్యసించేందుకు దూరభారం తగ్గింది. నాలుగు జిల్లాల విద్యార్థులకు టీయూ అనుకూలంగా ఉన్నది. ఇక్కడ చదివిన ఎంతోమంది విద్యార్థులు జీవితంలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నారు.
– యెండల ప్రదీప్, విద్యార్థి సంఘం నాయకుడు