బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 23 : అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, భవిష్యత్లో కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గ్రామం లో రూ. కోటితో చేపట్టనున్న 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సబ్స్టేషన్ ఏర్పాటుతో తిర్మలాపూర్, కొత్తబాది, సింగి తం తదితర గ్రామాలకు విద్యుత్ ఇబ్బందులు తొలగిపోనున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముం దు సీమాంధ్ర పాలకులు రాష్ట్రం ఏర్పడితే తీవ్రమైన కరెంట్ కొరత ఏర్పడుతుందని, రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందంటూ ఆరోపణలు చేశారని గుర్తు చేశారు.
వారి ఆరోపణలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణను కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా కొద్ది కాలంలోనే తీర్చిదిద్దారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 7,370 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో తీసుకున్న పకడ్బందీ చర్యలతో నేడు 14 వేల మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని 25వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా ప్రభు త్వం పనులు చేపట్టిందని వివరించారు. రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాల ఆయకట్టు ఉందని ఇందులో 60లక్షల ఆయకట్టు బోరు బావుల కింద సాగు అవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టేలా చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.
రైతులకు మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రం సూచించినా, అన్నదాత సంక్షేమమే ధ్యేయమని, ఎన్ని కోట్ల నష్టం వచ్చి నా ప్రభుత్వమే భరిస్తుందని, మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ కేంద్రానికి స్పష్టం చేశారని తెలిపారు. రైతులకు నష్టం కలిగించేలా కేంద్ర చర్యలను రాష్ట్ర ప్రభుత్వం సహించదన్నారు. యాసంగిలో పం డించిన ధాన్యం కొనకుండా రైతులను మోసం చేసిందని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తక్కువ ధరకు అమ్మి రైతులు నష్టపోవద్దనే సంకల్పంతో కష్టమైనా, నష్టమైనా ప్రభుత్వమే భరించాలని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
దేశంలోని అనేక రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. సంక్షేమ పథకాల అమలులో వెనుకబడి, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేక లేనిపోని అసత్యపు ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. గుంట గుంటకు సాగు నీరు, ఇంటింటికీ తాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జిన్న రఘురామయ్య, విద్యుత్ ఎస్ఈ శేషారావు, డీఈలు శ్రీనివాస్, కామేశ్వర్రావు, ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, బాన్సువాడ, బుడిమి సొసైటీల అధ్యక్షులు ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, ఏఈ నర్సయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, గోపాల్రెడ్డి పాల్గొన్నారు.