గజ్వేల్, ఆగస్టు 7 : కేసీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో కోట్లాదిగా మొక్కలు నాటడంతో ఆకుపచ్చ తెలంగాణ ఏర్పడిందని రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్రావు పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వెంకటాపూర్లో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2వేల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ను మహాయజ్ఞంలా ముందుకు తీసుకెళ్తూ రేపటి తరాల కోసం మరింతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా చేపడుతున్నామని చెప్పారు.
గత పదేండ్ల కాలంలో కేసీఆర్ ప్రారంభించిన హరితహారంలో కోట్లాది మొక్కలు నాటడంతో తెలంగాణ అడవుల్లోనే కాకుండా పల్లెలకు వెళ్లే దారులు కూడా పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం నాటుతున్న మొక్కలతో రాబోయే తరాలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.