ఇందూరు, ఏప్రిల్ 23 : మున్సిపల్ కార్మికులకు ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీరామ గార్డెన్లో మున్సిపల్ కార్మికులకు ప్రపంచ కార్మికుల దినోత్సవం (మేడే) పురస్కరించుకొని శనివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 15వందల మంది మున్సిపల్ పారిశుద్ధ్యం, వాటర్ వర్క్స్ కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ.. కార్మికులందరికీ ముందస్తుగా మేడే శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్మికుల సేవలు వెల కట్టలేనివన్నారు. కరోనా సమయంలో వారు ప్రాణాలను లెక్క చేయకుండా, నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పని చేశారన్నారు.
ప్రపంచం మొత్తం లాక్డౌన్ ఉన్నప్పటికీ మున్సిపల్ కార్మికులు మాత్రం పారిశుద్ధ్యం, వాటర్ సప్లయ్, వీధి లైట్ల సేవలకు ఆటంకం కలుగకుండా పని చేశారన్నారు. నిజామాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఉందన్నారు. కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానన్నారు. కార్మికుల కృషితో ఈ రోజు నిజామాబాద్ నగరం స్వచ్ఛంగా ఉందన్నారు. నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అభివృద్ధికి కావాల్సిన నిధులను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించుకుందామన్నారు. అనంతరం కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, రెడ్కో చైర్మన్ ఎస్ఎ అలీం, మున్సిపల్ కమిషనర్ చిత్రామిశ్రా, మాజీ మేయర్ ఆకుల సుజాత, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.