ఉమ్మడి జిల్లాలో ముస్తాబైన శైవక్షేత్రాలు
ఇందూరు, ఫిబ్రవరి 28: భక్తవశంకరుడు, భోళా శంకరుడు అయిన పరమేశ్వరుడి పూజకు వేళయ్యింది. మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఉపవాస దీక్షలకు శివయ్య భక్తులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఫలపుష్పాదుల కొనుగోలుతో మార్కెట్లు సందడిగా మారాయి. శ్రీరామనవమి వరకు కొనసాగే సేవాలాల్ దీక్షలు గిరిజనతండాల్లో నేటినుంచి ప్రారంభం కానున్నాయి.
ఇందూరు కంఠాభరణమైన నీలకంఠేశ్వరస్వామి ఆలయంతోపాటు ప్రసిద్ధిగాంచిన శంభులింగేశ్వరాలయం, ఉమామహేశ్వర ఆలయం, నగరేశ్వరాలయం, మనోకామేశ్వరాలయం, మార్కండేయ మందిరం, నాందేవ్వాడ సాయిబాబా, నాగారం, నందిగుట్ట ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి మహాన్యాస పూర్వక లింగోద్భవ నిశి పూజ కార్యక్రమం, ఉదయం నుంచి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించనున్నట్లు నీలకంఠేశ్వర, శంభులింగేశ్వర స్వామి ఆలయాల ఈవోలు వేణు, శ్రీరాం రవీందర్ తెలిపారు.
తాండూర్.. త్రిలింగ రామేశ్వరుడు
నాగిరెడ్డిపేట, ఫిబ్రవరి 28 : రామేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర అనే మూడు లింగాల కలయికతో ఒకే చోట లింగాకృతిలో ఉన్న మందిరం త్రిలింగ రామేశ్వర దేవాలయం. మూడు లిం గాలు ఒకే ఆలయంలో నిర్మించి ఉండడం ఎక్కడా కానరాదు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలోని ఈ ఆలయానికి విశిష్టమైన చరిత్ర ఉందని పెద్దలు చెబుతారు. గ్రామ శివారులోని సనాతన త్రిలింగేశ్వరాలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించారని పెద్దలు చెబుతున్నారు. ఈ దేవాలయం, ముఖ ద్వారం, ప్రధాన ద్వారం, స్వాగత తోరణాలన్నీ కూడా ఒకే రాతితో నిర్మించారు. ప్రతి ముఖ ద్వారానికి ఒకే రాతితో నిర్మించిన శిల్పకళా ఉంటుంది. ఈ ఆలయాన్ని ఏవైపు నుంచి చూసినా లింగాకృతిలో కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహాన్ని లేపాక్షి నంది విగ్రహంతో పోలుస్తారు. ఈ ఆలయాన్ని ఒకే కాలు, ఒకే చేయి గల శిల్పాచార్యుడు రూపకల్పన చేశాడని పెద్దలు చెబుతున్నారు. ఉత్సవాలకు జిల్లా వాసులే కాకుండా మెదక్, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
మహాదేవుడు.. బోధన్ చక్రేశ్వరుడు
బోధన్, ఫిబ్రవరి 28: బోధన్ పట్టణంలోని చారిత్రక శివాలయం శ్రీ చక్రేశ్వర శివమందిరం. వాస్తవానికి ఈ చక్రేశ్వర ఆలయం మట్టి తవ్వకాల్లో బయటపడింది. 1959 ఫిబ్రవరి 7 (అమావాస్య)రోజున ఒక రైతు మట్టిదిబ్బను చదునుచేస్తుండగా… నల్లని రాతితో ప్రకాశవంతమైన శివలింగం, గర్భగుడి, పైన శిఖరంతో చెక్కు చెదరని రీతితో బయటపడింది. బోధన్కు ఏకచక్రపురం అనే పేరు ఉండడంతో ఇక్కడి శివలింగానికి ఏకచక్రేశ్వరుడు, చక్రేశ్వరుడు అని పేర్లు పెట్టారు. పాండవుల కాలంలోనే ఈ శివాలయం పూజలందుకున్నదని అంటుంటారు. దక్షిణ భారతదేశంలోని శివాలయాల్లోని మూల విగ్రహాల్లో అతి పెద్దవిగా పేరొందిన శివలింగాల్లో ఈ శివాలయంలోని మూల విగ్రహం ఒకటి కావడం విశేషం. ఈ శివలింగం చుట్టుకొలత రెండున్నర అడుగులు కాగా, చక్రేశ్వర శివలింగం అడుగున ఉండే పానువట్టం చుట్టుకొలత 24 అడుగులు కావడం గమనార్హం. త్రేతాయుగంలో రాక్షస సంహారం కోసం బయల్దేరిన పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడన్న స్థల పురాణం ఈ ఆలయానికి ఉన్నది. శివలీలామృతం అనే ప్రాచీన సంస్కృత గ్రంథంలో ఈ శివాలయం ప్రసక్తి ఉన్నది.
భిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయం..
భిక్కనూర్,ఫిబ్రవరి 28: భిక్కనూర్ మండల కేంద్రంలోని స్వయంభూలింగం శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయం శివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. ఈ ఆలయాన్ని సిద్ధగిరి, రామగిరి అనే యోగిపుంగవులు నిర్మించినట్లు పౌరాణిక గాథ ప్రచారంలో ఉన్నది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో వేకువజాము నుంచి విశేష పూజలు నిర్వహి స్తారు. భక్తులు ఆలయంలోని మూల బావి వద్ద స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకుంటారు. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహారుద్రాభిషేకం, 108 లీటర్ల ఆవుపాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానుండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నవనాథ సిద్ధుల గుట్ట
ఆర్మూర్, ఫిబ్రవరి 28: ప్రకృతి సోయగాల తోర ణం, సహజ అందాల మేళవింపుతో ఆధ్యాత్మిక క్షేత్రంగా నవనాథ సిద్ధుల గుట్ట విలసిల్లుతున్నది.త్రేతాయుగంలోని మునీశ్వరులు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశారని చరిత్ర చెబుతున్నది. ఈ గుట్టపై ఉన్న గుహల్లో మొదట ఆరుగురు మునీశ్వరులు, తర్వాత ముగ్గురు మునీశ్వరులు తపమాచరించి శివైక్యం పొందారని, వీరి పేరుతోనే నవనాథపురమని పేరు వచ్చిందని స్థల పురాణం పేర్కొంటున్నది. ద్వితీయ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ నవనాథ సిద్ధేశ్వరలింగం ఒకటి. ఈ లింగం 11వ శతాబ్దానికి చెందినదని తేలింది. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మూర్లో నవనాథ సిద్ధుల గుట్ట ఉన్నది. గుట్టకు సమీపంలో నుంచి సిద్ధుల గుట్టపైకి కాలినడక వెళ్లడానికి మెట్ల మార్గం ఉన్నది. జాతీయ రహదారిని ఆనుకొని గుట్టపైకి వెళ్లడానికి ఘాట్ రోడ్డు మార్గాన్ని నిర్మించారు. సిద్ధుల గుట్టపైన రామాలయం, పవిత్రమైన కోనేరు, స్వర్ణగుండం, పాలగుండం, పాతాళగంగ, గుట్ట చివరన ఎంతో శక్తిమంతమైన హనుమాన్ మందిరం, ఏకశిలా స్తంభం, బిల్ స్టోన్, అయ్యప్ప ఆలయం, చిల్డ్రన్ పార్కు, గోశాల, దత్తాత్రేయ, దుర్గామాత, ఎల్లమ్మ తల్లి ఇలా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను ఆలయ కమిటీ సభ్యులు శివరాత్రిని పురస్కరించుకొని సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. శివరాత్రి మరుసటి రోజు ఉ పవాస దీక్షతో ఉన్న భక్తులందరికీ అన్నప్రసాదం చేసేందుకు ఆలయ కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
మహిమాన్వితుడు నాళేశ్వర్ రాజరాజేశ్వరుడు..
నవీపేట,ఫిబ్రవరి 28:నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామ శివారులోని గోదావరి నది తీరాన ఉన్న శివాలయానికి వందల ఏండ్ల చరిత్ర ఉందని భక్తులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని రాజరాజచోళ నిర్మించినట్లు ప్రతీతి. గోదావరి పుణ్యస్థలంలో ఋషులు తపస్సు చేస్తుండగా స్వయం భూ లింగంగా ఉద్భవించిందని పురాణ గాథలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసంలో భాగంగా గోదావరి తీరంలో వెలసిన పుణ్యక్షేత్రంలో సాయంసంధ్యా వేళలో నిత్య పూజలు చేసేవాడని, ద్వాపర యుగంలో పాండవులు సైతం శివలింగాన్ని దర్శించుకున్నారని ఆలయ స్థల పురాణంలో ఇమిడి ఉంది. వీరితోపాటు జగద్గురు శంకరాచార్యులు సైతం ఈ ఆలయాన్ని దర్శించుకున్నారని శాస్ర్తాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణలోని పంచరామాలయాల్లో ఈ ఆలయం ఒకటి.ఇక్కడ వెలసిన రాజరాజేశ్వర స్వామిని అన్నగా, వేములవాడ రాజన్నను తమ్ముడిగా భక్తులు భావిస్తుంటారు.