రామారెడ్డి, నవంబర్ 18;పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది. వైద్యులు, సిబ్బంది నియామకంతోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. దీంతో ప్రభుత్వ దవాఖానల సేవలను వినియోగించుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల పరిధిలోని 13 గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నది. నిత్యం ఇక్కడకు 150 మంది వరకు పలు రకాల ఆరోగ్య సమస్యలతో వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరం ఉన్న వారి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నారు. రిపోర్టు ఆధారంగా వారికి సరైన చికిత్సలు అందిస్తున్నారు. అత్యవసర వైద్యం అవసరం ఉన్న వారిని నిజామాబాద్, కామారెడ్డి తదితర పట్టణాల్లోని దవాఖానలకు రిఫర్ చేస్తున్నారు.
అందుబాటులో 102 వాహనం..
రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో నెలకు నాలుగు సార్లు గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. వారిని ఇంటి నుంచి 102 అమ్మ ఒడి వాహనంలో ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చి పరీక్షల అనంతరం ఇంటికి సురక్షితంగా చేరుస్తున్నారు. దీంతో వారికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా పోయాయి. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యంపై వారు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
గర్భిణులకు యోగా..
గర్భిణులు సుఖ ప్రసవం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ దవాఖానలో గర్భిణులతో యోగా చేయిస్తున్నారు. వారానికి ఒక రోజు వారి కోసం ప్రత్యేకంగా యోగా తరగతులను నిర్వహిస్తున్నారు. గర్భిణికి ఎనిమిదో నెలలో గైనకాలాజిస్టు పరీక్షలు చేస్తున్నారు. రక్తహీనత, ఇతర ఇబ్బందులు ఉన్న వారిని గుర్తించి మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు.
టీబీ, పైలేరియా రోగులకు..
టీబీ, లెప్రసీ, పైలేరియా రోగులకు కూడా ఇక్కడ ప్రత్యేక చికిత్సలు చేస్తున్నారు. తెమడ తదితర శాంపిళ్లను సేకరిస్తున్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత మందులతోపాటు దాతల సహకారంతో పోషకాహారాన్ని అందజేస్తున్నారు.
కేసీఆర్ కిట్టుతో సంతోషం..
ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్టును అందజేస్తున్నది. దీంతో ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వం అందజేస్తున్న కేసీఆర్ కిట్తో గర్భిణులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ కిట్తో పాటు మగ పిల్లవాడు పుడితే రూ.12 వేలు, ఆడ పిల్ల పుడితే రూ.13వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది.
ఆరోగ్య శ్రీ సేవల్లో ఫస్ట్..
రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య శ్రీ సేవల్లో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. రోగులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు ఉత్తమ సేవలు అందించినందుకు గాను జిల్లాలో రెండో స్థానం దక్కించుకున్నది.
మెరుగైన సేవలను అందిస్తున్నాం..
రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన సేవలను అందించడంతో జిల్లా లోనే రెండో స్థానంలో నిలిచింది. పీహెచ్సీ పరిధిలోని 34 మంది గర్భిణులకు గాను 32 మందికి కాన్పులు చేశాం. రోగులకు మరిన్ని సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాం.
– డాక్టర్ షాహీద్ అలీ, పీహెచ్సీ వైద్యాధికారి.
రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య విష యంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవల ను అందిస్తున్నారు. ఎమ్మెల్యే సురేందర్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం దవాఖానలో మౌలిక వసతుల కోసం రూ.24లక్షలను మంజూరు చేసింది.
– నారెడ్డి దశరథ్రెడ్డి, ఎంపీపీ, రామారెడ్డి.