ఖలీల్వాడి, నవంబర్ 7 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు సమయపాలన పాటిస్తూ తప్పని సరిగా హాజరు కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో ఆయా అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజావాణికి గైర్హ్హాజరయ్యే, నిర్ణీత సమయానికి హాజరు కాని అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అనుసరిస్తూ వేతనాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
మండల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయి పరిశీలన
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లాలో ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల ప్రగతిని పరిశీలించేందుకు మండల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఈనెల 15న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, 18న దిశా మీటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో రావాలని సూచించారు. సోమవారం నుంచి ప్రారంభమైన టీడీ (టెటనస్, డిప్తీరియా) వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించేందుకు అంకిత భావంతో కృషి చేయాలన్నారు. జిల్లా విద్యా, వైద్యారోగ్య వసతిగృహాలు, సంక్షేమ బడులు, కేంద్రీయ విద్యాలయాలు, మదర్సాలు, తదితర విద్యా సంస్థల్లో చదువుతున్న ఐదు, 10వ తరగతి విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ జరిగేలా చొరవ చూపాలన్నారు.
ఆధార్ అప్డేట్ చేసుకోవాలి : అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
2015 సంవత్సరానికి ముందు ఆధార్ కార్డు పొందిన వారందరూ తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని ప్రజావాణి సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. వివిధ ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు సేవలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖల జిల్లా అధికారులు కృషి చేయాలని, ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపేలా చూడాలన్నారు.
41 ఫిర్యాదులు స్వీకరణ
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్ ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు.