కామారెడ్డి టౌన్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి ఋణాలు ఇవ్వడంలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో గురువారం ఋణ విస్తీరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి ఋణాలు ఇచ్చి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. మహిళలు తీసుకున్న ఋణాలు వాయిదా పద్ధతిలో సకాలంలో చెల్లించడం వల్ల వారికి బ్యాంకులు రెట్టింపు ఋణాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
రైతులు పంట ఋణాలు సకాలంలో చెల్లించాలని కోరారు. జిల్లా మహిళా సమైక్యకు, స్వయం సహాయక సంఘాలకు చెక్కులను పంపిణీ చేశారు. 16 బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. సమావేశంలో చైర్పర్సన్ జాహ్నవి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, బ్యాంక్ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.