విద్యానగర్, ఏప్రిల్ 20:కొవిడ్ మహమ్మారి కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు. చాలా వరకు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు కోలుకోలేని పరిస్థితికి చేరుకున్నాయి. ఈ ఏడాది కొవిడ్ తగ్గుముఖం పడుతున్న వేళ ఆరో తరగతి వరకు పాఠశాలలను తెరుచుకోవాలని ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచ ర్లు, సిబ్బందికి కొంత ఊరట లభించింది. మళ్లీ కరోనా విజృంభిస్తుండడంతో పాఠశాలలను తిరిగి మూసివేశారు. దీంతో టీచర్లు, సిబ్బంది రోడ్డున పడ్డారు. యాజమాన్యా లు జీతాలు ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. వారి ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారిని ఆదుకుంటామని భరోసానిచ్చింది. సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో ప్రైవేట్ ఉపాధ్యాయులకు,సిబ్బందికి నెలకు రూ. రెండు వేలు, 25 కిలోల సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించి, ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులకు మంగళవారం నుంచి వారి ఖాతాల్లో డబ్బులు జమచేయనుండగా.. బుధవారం నుంచి 25 కిలోల సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభంకానున్నది.
ఉమ్మడి జిల్లాలో 7,403 మందికి లబ్ధి..
యూ-డైస్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో 623 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కామారెడ్డిలో 173, నిజామాబాద్లో 450 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఉమ్మడి జిల్లాలో 7,403 మంది లబ్ధి పొందనున్నారు. కామారెడ్డిలో 1839 మంది టీచర్లు,145 మంది బోధనేతర సిబ్బంది మొత్తం 1,984 మంది ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 5,296 టీచర్లు, 123 మంది బోధనేతర సిబ్బంది మొత్తం 5,419 మంది ఉన్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు సర్వే చేయించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి జాబితాను రూపొందించారు. యూడైస్ రికార్డు ప్రకారం 7,403 మందికి నెలకు రూ.1,48,06,000 ఆర్థిక సహాయంగా ప్రభుత్వం అందించనున్నది. 1,85,075 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేయనుంది. ఎంపికైన వారి బ్యాంకు ఖాతాలో రెండు వేల రూపాయలు జమచేయనుండగా, బుధవారం నుంచి 25కేజీల బియ్యం పంపి ణీ చేయనున్నారు. కేసీఆర్ నిర్ణయంతో ప్రైవేట్ టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వంపై భరోసా పెరిగింది..
కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి ఇబ్బందిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రైవేట్ టీచర్లకు రూ. రెండు వేలు, 25 కిలోల సన్న బియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. దీంతో ప్రభుత్వంపై భరోసా పెరిగింది.
-ఎస్.రవి ,ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు
ఇద్దరికీ ఇవ్వడం హర్షణీయం..
నేను. నా భార్య కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాం. గతేడాది నుంచి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు మూసి వేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. కేసీఆర్ నిర్ణయంతో ప్రైవేట్ టీచర్లుగా పని చేస్తున్న మాకు ఇద్దరికీ ఒక్కొక్కరికీ రూ. రెండువేలు, 25 కేజీల బియ్యం వస్తాయి. మాకు ఎంతో ఆనందంగా ఉంది.
-ఎన్.అర్జున్ రాజ్, జ్యోతి (ప్రైవేట్ టీచర్లు)
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల టీచర్లు
కరోనా కారణంగా గతేడాది ఫిబ్రవరి నుంచి విద్యాసంస్థలు మూసివేడయంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఉపాధి లేక వేతనాలు రాక రోజువారి కూలీ,ఉపాధి హామీ,వ్యవసాయ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది.వీరి సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంతో ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.