కామారెడ్డి టౌన్,ఆగష్టు 16: ఓ బాధిత కుటుంబానికి కలెక్టర్ శరత్ బ్యాంకు రుణం మాఫీ చేయించి చేయూతనిచ్చారు. మిగతా డబ్బులను దాతల సహకారంతో బ్యాంకులకు చెల్లించి గొప్ప మనసు ను చాటుకున్నారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి, అతని భార్యను కరోనా మహమ్మారి పొట్టనబెట్టుకుంది. దీంతో వారి ఇద్దరి పిల్లలు అనాథలయ్యారు. వారి ఇంటికి సంబంధించిన బ్యాంకు రుణం రూ.18 లక్షలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెల్లించాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన కలెక్టర్ శరత్ బ్యాంకు అధికారులతో మాట్లాడి రూ.8 లక్షలు మాఫీ చేయించారు. మిగితా రూ. పది లక్షలు ఆర్మూర్ ఆర్పీ ట్రేడర్స్, హైదరాబాద్ నిర్మల ఇన్ఫ్రా కంపెనీ, కరీంనగర్ ఆయాత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరీంనగర్ ఎన్జేఆర్ కంపెనీ ప్రతినిధులు కలిసి రూ. 4లక్షలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగి విశ్వనాథ్ రూ.2.50 లక్షలు, బంధువుల ద్వారా రూ. రెండు లక్షలు, ఇతర దాతల నుంచి లక్షన్నర అందజేశారు. మొత్తం రూ.10 లక్షలు బ్యాంకు చీఫ్ మేనేజర్ పి. శ్రీనివాస్కు సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. వన్టైం సెటిల్మెంట్ కింద రుణమాఫీ చేయించారు. అనాథలైన పిల్లల నాయనమ్మ సిద్ధమ్మ తమ కుటుంబాన్ని ఆదుకున్న కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో చిన్నపిల్లల బాబాయ్ యు. రాజు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అహ్మద్, కేశవరెడ్డి, రజిత్రావు, రోహిత్ రావు, ఎల్డీఎం. రాజేందర్ రెడ్డి ఉన్నారు.