విద్యానగర్, మే 16:రక్తదానంతో ఒకరి ప్రాణాలను కాపాడినవారమవుతాం. అదేవిధంగా ప్లాస్మాదానంతోనూ ప్రాణం నిలుపుతున్నారు దాతలు. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా నుంచి కోలుకునేందుకు ప్లాస్మా సహాయపడుతున్నది. కరోనాను జయించిన వారి రక్తం(ప్లాస్మా)ను వైరస్ బాధితులకు ఎక్కిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అయితే ప్లాస్మాదానంపై చాలా మంది అపోహలను నమ్ము తూ దూరంగా ఉండేవారు.. కానీ ప్లాస్మాథెరపీతో ప్రాణం గట్టెక్కే అవకాశాలుండడంతో కామారెడ్డి జి ల్లాలో ప్లాస్మాదానానికి ముందు కు వస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కరోనా విజయులు.
ప్లాస్మాతో త్వరగా రికవరీ
కొవిడ్ను జయించిన వ్యక్తి ప్లాస్మాలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. దీనిని పాజిటివ్ వ్యక్తి శరీరంలో ప్రవేశపెడితే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ను నాశనం చేస్తాయి. ఈ విధానం సత్ఫలితాలను ఇస్తుండడంతో ప్లాస్మాదానంపై ప్రచారం జరుగుతున్నది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారికి పరీక్షలు చేసిన తర్వాత ప్లాస్మాను స్వీకరిస్తారు. ఒకరి నుంచి సేకరించిన ప్లాస్మాతో సుమారు ముగ్గురు పాజిటివ్ వ్యక్తులను కాపాడొచ్చని వైద్యులు చెబుతున్నారు.
ప్లాస్మాదానంతో ప్రమాదం ఉండదు
ప్లాస్మాదానంతో ఎలాంటి ప్రమాదం ఉండదు. రక్తం నుంచి సేకరించిన ప్లాస్మా 24 నుంచి 48గంటల్లో దాత శరీరంలో యథావిధిగా తయారవుతుంది. 600ఎంఎల్ రక్తం నుంచి 360 ఎంఎల్ ప్లాస్మాను సేకరించవచ్చు. ఆరోగ్యవంతుడైన వ్యక్తి ప్లాస్మాను 28రోజులకోసారి సంవత్సరంలో 13సార్లు దానం చేయవచ్చు. ప్లాస్మా ఇచ్చేవారి హిమోగ్లోబిన్ లెవల్స్ 12.5 జీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉండాలి.
బ్లడ్, ప్లాస్మాదానానికి వాట్సాప్ గ్రూప్..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రక్తదాతల సమూహాన్ని 2009లో 100 మందితో ఏర్పాటు చేశారు. ఈ సమూహానికి బాధ్యుడుగా పట్టణానికి చెందిన బాలు ఉన్నారు. 2016లో వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి 2వేల నుంచి 3వేల మందితో రక్తం అవసరం ఉన్న వారు ఫోన్ చేసినా, వాట్సాప్లో మెసేజ్ పెట్టిన వెంటనే స్పందించి వారికి రక్తదానం చేస్తుంటారు. ఇప్పటి వరకు 7వేల యూనిట్ల రక్తదానం చేశారు. ప్రస్తుతం కరోనా సెకండ్వేవ్ నేపథ్యంలో కొవిడ్ బారిన పడివారికి ప్లాస్మా దానం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 65 మందికిపైగా 50 యూనిట్ల ప్లాస్మాదానం చేసి ప్రాణాలను కాపాడారు.