నిండుకుండలా ప్రాజెక్టు
కుడి, ఎడమ కాలువల ద్వారా పంటలకు నీటి విడుదల
ఆయకట్టు రైతుల హర్షం
ధర్పల్లి, ఆగస్టు 14 : జిల్లాలోని మొట్టమొదటి మధ్యతరహా ప్రాజెక్టు అయిన మండలంలోని రామగుడు ప్రాజెక్టు జలకళ సంతరించుకొని నిండుకుండలా మారింది. ఈ ఏడాది ఆరంభం నుంచే వర్షాలు బాగా కురవడంతో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి లింగాపూర్ వాగు ద్వారా ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున పంటలు వేయడంతో ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
ఏడువేల ఎకరాలకు సాగునీరు
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1278.300 అడుగులు కాగా ప్రస్తుతం 1276.810 అడుగుల వద్ద ఉన్నది. నాలుగు మండలాల్లోని 15 గ్రామాల పరిధిలోని ఏడు వేల ఎకరాలకు సాగునీరందిం చడమే లక్ష్యంగా 0.6 టీఎంసీల నీటి నిల్వ స్థాయి నుంచి 0.966 టీఎంసీల (1278.50అడుగులు) నీటి నిల్వ స్థాయికి పెంచుతూ ఆధునీకరణ పనులు చేపట్టారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే ధర్పల్లి మండలంతో పాటు డిచ్పల్లి, జక్రాన్పల్లి, భీంగల్ మండలాల్లోని 15 గ్రామాల పరిధిల్లో ఉన్న ఏడువేల ఎకరాలకు సాగునీరందుతుంది. ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 5500ఎకరాలకు, 22 కిలోమీటర్ల దూరం మేర రామడుగు, కేశారం, మైలారం, చల్లగర్గె, చింతలూర్, చేంగల్, బడాభీమ్గల్, గ్రామాలకు నీరందుతోంది. కాగా మూడేండ్ల క్రితం చేపట్టిన ఆధునీకరణ పనుల ద్వారా మరో నాలుగు గ్రామాలైన వాడి, కొత్తపల్లి, పచ్చలనడ్కుడ, ఆక్లూర్ పరిధిల్లోని పంటలకు సాగునీరందుతోంది. ఎడమ కాలువ ద్వారా 1500ఎకరాలకు, సుద్దులం, కొరట్పల్లి, కలిగోట్, మనోహరాబాద్ గ్రామాలకు సాగు నీరందుతుంది.
కొనసాగుతున్న నీటి విడుదల
ప్రాజెక్టు ఆయకట్టు పంటలకు ఈ నెల 4న జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ నల్ల సారికాహన్మంత్రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి రైతుల వినతి మేరకు నీటిని విడుదలను ప్రారంభించారు. కుడి కాలువ ద్వారా 48క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 10 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోందని ప్రాజెక్టు ఏఈ ప్రశాంత్ తెలిపారు. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలు!
ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలను తెప్పించేందుకు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషి చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మంచిప్ప రిజర్వాయర్ అక్కడ నుంచి రామడుగుప్రాజెక్టులోకి పైప్లైన్ ద్వా రా నీటిని మళ్లించేందుకు ఎమ్మెల్యే పట్టుదలతో ఉన్నా రు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.
భూగర్భ జలాలకు ఢోకాలేదు..
ప్రాజెక్టు నీరే మా గ్రామంతోపాటు చుట్టూ పక్కల గ్రామాలకు ప్రధాన ఆధారం. ప్రాజెక్టు ఉండడంతో మా గ్రామంలో భూగర్భ జలాలకు ఢోకా లేకుండా పోతోంది. ప్రాజెక్టు నిండితే సాగునీటికి, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతుంది. ఈ వానకాలంలో వానలు బాగా కురిసి ప్రాజెక్టులోకి నీళ్లు బాగానే వచ్చాయి. పంటలకిక ఏ ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో పంటలు వేశాం.
-మురళీగౌడ్, రైతు, రామడుగు గ్రామం
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
ప్రాజెక్టు అభివృద్ధికి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి కృషి చేస్తున్నారు. ఆయకట్టు కింద పంటలకు నీటిని విడుదల చేయాలని కోరగానే అధికారులకు సూచించి నీటిని విడుదల చేయించారు. రామడుగు అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యేకు, జడ్పీటీసీ జాజిరెడ్డి జగన్కు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
-కల్టెడ నవీన్రెడ్డి,
వైస్ ఎంపీపీ, ప్రాజెక్టు రామడుగు గ్రామం.