ఝాన్సీ 8వ తరగతి చదువుతున్నది. మొబైల్ ద్వారా ఆన్లైన్ తరగతులు వింటున్నది. అయితే మధ్యలో చార్జింగ్, సిగ్నల్ తదితర సమస్యలతో పాఠాలు సరిగ్గా వినలేదు. తర్వాత రోజు సందేహాలను నివృత్తి చేసుకుందామంటే టీచర్ ఏమంటరోనని, తోటి విద్యార్థులు ఏమనుకుంటారోననే భయం పట్టుకున్నది.
రాజేశ్ 10వ తరగతి చదువుతున్నాడు. తరగతిలో రెండుసార్లు వింటేకానీ లెక్కలు అర్థం కాని పరిస్థితి. అలాంటిది ఆన్లైన్లో టీచర్లు ఒకేసారి చెబుతుండడంతో ఇబ్బందిగా ఫీలవుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు ట్యూషన్కు వెళ్లే అవకాశమూ లేదు. దీంతో ఇటు విద్యార్థి, అటు తల్లిదండ్రులు విద్యాభ్యాసంపై ఆందోళన చెందుతున్నారు.
ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 11: కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం వృథా కాకూడదని ప్రభుత్వం ఆన్లైన్ బోధనకు శ్రీకారం చుట్టింది. అయితే తరగతి గది బోధన లేకపోవడంతో విద్యార్థులు కొంత మేరకు పా ఠ్యాంశాలు అర్థంకాక ఆందోళనకు గురవుతున్నారు. కొద్దిమంది విద్యార్థులు ఇంటి పనులు, తల్లిదండ్రులతో ఇతర పనులకు వెళ్తున్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆడుతూ పాడుతూ గడిపేస్తున్నారు. ఆన్లైన్ బోధనలో అర్థం కాని పాఠ్యాంశాలను తిరిగి ఉపాధ్యాయునికి అడగాలంటే విద్యార్థులు భయానికి లోనవుతున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి విద్యాశాఖ సరికొత్తగా క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్ను ముద్రించి దానికి వీడియో రూపకల్పన చేసి పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని పాఠ్యపుస్తకాలకు క్యూఆర్ కోడ్ ముద్రించి నూతన విధానానికి తెరతీశారు.
గతేడాది సెప్టెంబర్ నుంచి పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక బోధన లేకపోవడంతో టీ-సాట్, దూరదర్శన్ల ద్వారా విద్యాబోధన కొనసాగిస్తున్నారు. దీంతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ఇంట్లోనే పాఠ్యాంశాలు సులువుగా అర్థం కావడానికి, ఎప్పుడుపడితే అప్పుడు మళ్లీ చూసేందుకు అణువుగా పాఠ్యపుస్తకాలపై కొత్తగా క్యూఆర్ కోడ్ను ముద్రించింది. ఆన్లైన్ బోధనకు టీ-సాట్ చానల్లో టైంటేబుల్ ప్రకారం పాఠ్యాంశాల బోధన కొనసాగుతున్నది. ఈ సమయంలో విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు వస్తే..అంటే కరెంటు పోవడం..సమయానికి సెల్ఫోన్ ఇంట్లో అందుబాటులో ఉండకపోవడం
పాఠ్యాంశాలు వినే అవకాశం లేదు. కానీ పుస్తకాలపై క్యూర్ కోడ్ విధానం ప్రవేశపెట్టడంతో విద్యార్థికి ఇష్టమైన సమయంలో సెల్ఫోన్ ద్వారా కోడ్ను స్కాన్ చేస్తే క్షణాల్లో పాఠ్యాంశానికి సంబంధించి పూర్తి వివరాలతో వీడియో క్లిప్పింగ్ వస్తుంది. అర్థం కాకపోతే ఎన్నిసార్లు అయినా తిరిగి చూసుకునే అవకాశం ఉండడంతో విద్యార్థులకు వరంగా మారింది.
విద్యార్థులు తమ మొబైల్లోని ప్లేస్టోర్లోకి వెళ్లి దీక్ష అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం తెలుగు, ఇంగ్లీషు, హిందీ మీడియానికి సంబంధించి భాషను ఎంచుకోవాలి. అనంతరం క్యూఆర్ కోడ్ స్కానింగ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి పాఠ్యపుస్తకంలో ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేస్తే ఆ పాఠ్యాంశానికి సంబంధించి సమగ్ర వివరాలతో వీడియో పాఠాలు ప్రత్యక్షమవుతాయి.
కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర విద్యాశాఖ పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్ను ముద్రించింది. దీంతో విద్యార్థులకు ఎంతో సౌకర్యం కలుగుతున్నది. విద్యార్థులు క్యూఆర్ కోడ్ను సద్వినియోగం చేసుకొని వీడియో పాఠాల ద్వారా చక్కగా అర్థం చేసుకొని, తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలి.
ఈ సమస్య వీరిదే కాదు.. చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ కొత్త మార్పులు తీసుకొచ్చింది. పాఠ్యపుస్తకాలపై, ప్రతి పాఠం మధ్యలో క్యూఆర్ కోడ్ను ముద్రించింది. తద్వారా విద్యార్థులకు సందేహాలున్నా, తరగతులకు హాజరుకాలేకపోయినా మొబైల్ ద్వారా స్కాన్ చేసి పాఠం మళ్లీ వినే అవకాశం కల్పించింది.
ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేశారు. కానీ ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ విభాగాల వారికి మాత్రమే ఈ విధానాన్ని అమలు చేశారు. మిగతా గ్రూప్ల వారి పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్ వెసులుబాటు లేదు. గణిత, భౌతిక, రసాయన, వృక్ష, జంతుశాస్ర్తాలకు సంబంధించిన పుస్తకాలపైనే క్యూఆర్ కోడ్ను ముద్రించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు క్యూఆర్ కోడ్ బోధన ఎంతో ఉపయోగపడుతున్నది.