బీబీపేట్/దోమకొండ/గాంధారి/నాగిరెడ్డిపేట్/తాడ్వాయి, మే 10 : బీబీపేట్ మండలకేంద్రంతోపాటు మాందాపూర్ గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో మధ్యాహ్నం వరకే దుకాణాలను తెరిచి ఉంచుతున్నారు. అనంతరం ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర సేవలందించే దవాఖానలు, మెడికల్ షాపులను మాత్రమే తెరిచి ఉంచుతున్నారు. దోమకొండ పంచాయతీ పాలకవర్గం తీర్మానం మేరకు దోమకొండ మండలకేంద్రంలో సెల్ఫ్ లాక్డౌన్ సోమవారం 16వ రోజుకు చేరుకుంది. దుకాణాలను ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెరిచి ఉంచుతున్నారు. ప్రజలు అత్యవసర సమయంలోనే కొవిడ్ నిబంధనలను పాటిస్తూ బయటికి రావాలని స్థానిక ప్రజాప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. గాంధారి మండల కేంద్రంలో సోమవారం పాక్షిక లాక్డౌన్ కొనసాగింది. లాక్డౌన్ కారణంగా మండల కేంద్రంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దుకాణాలను, హోటళ్లను తెరిచి ఉంచారు. కిరాణాదుకాణాలు, హోటళ్ల వద్ద భౌతిక దూరం పాటిచడంతోపాటు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సర్పంచ్ మమ్మాయి సంజీవ్ సూచించారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారు బయట తిరుగొద్దని, మాస్కు లు ధరించకుండా బయటికి వచ్చే వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామన్నారు. నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. మండల కేంద్రంలో సోమవారం సంతను రద్దుచేయడంతో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపారులు మధ్యాహ్నం రెండు గంటలకే దుకాణాలను బంద్ చేయడంతో జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. తాండూర్, ఆత్మకూర్, బొల్లారం, పోచారం గ్రామాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. తాడ్వాయి మండల పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. బ్రాహ్మణపల్లి, కృష్ణాజివాడి, దేమెకలాన్, తాడ్వాయి గ్రామాల్లో ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా వివిధ గ్రామాల్లో మధ్యాహ్నం వరకే దుకాణాలను తెరిచి ఉంచుతున్నారు.
గజ్యానాయక్ తండాలో లాక్డౌన్ పొడిగింపు..
మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్ తండా గ్రామంలో సెల్ఫ్ లాక్డౌన్ను పొడిగించారు. గతనెల 24న విధించిన స్వచ్ఛంద లాక్డౌన్ గడువు సోమవారంతో ముగియడంతో పంచాయతీ పాలవర్గ సభ్యులు మరో పది రోజులపాటు పొడిగించారు. గ్రామంలో ఈ నెల 20 వరకు లాక్డౌన్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఈ సందర్భంగా సర్పంచ్ హంజీనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలని సూచించారు. గ్రామస్తులు, దుకాణాదారులు నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. మాస్కు ధరించి వస్తేనే సరుకులు ఇవ్వాలని వ్యాపారులకు సర్పంచ్ సూచించారు.
రాత్రిపూట రోడ్లపైకి రావొద్దు..
మండలకేంద్రంలో రాత్రి కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఎస్సై రంజిత్ తెలిపారు. జాతీయ రహదారిపై పోలీసు సిబ్బందితో ఆదివారం రాత్రి గస్తీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రి కర్ఫ్యూ ఉన్నందున రాత్రి 9 నుంచి ఉదయం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రజలు రోడ్లపైకి రావొద్దని సూచించారు. ప్రజలు కరోనా మహమ్మారి వ్యాప్తిని అదుపు చేసేందుకు సహకరించాలని కోరారు.