బాన్సువాడ/గాంధారి/లింగంపేట/నాగిరెడ్డిపేట్/దోమకొండ/ విద్యానగర్/బీబీపేట్, మే 14 : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మూడోరోజైన శుక్రవారం సైతం కొనసాగింది. జిల్లావ్యాప్తంగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకే దుకాణాలను తెరిచి ఉంచారు. అనంతరం వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం 10 గంటల అనంతరం రోడ్లపైకి ఎవరూ రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మెడికల్ షాపులు, ప్రైవేటు దవాఖానలు ఎప్పటిలాగే తెరిచి ఉన్నాయి.
రంజాన్ పండుగ ఉండడంతో ఉదయం వేళ నిత్యావసర సరుకుల కోసం ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చారు. ఉదయం 5 నుంచి 10 గంటల వరకు తలపెట్టిన లాక్డౌన్ బాన్సువాడ పట్టణంలో సంపూర్ణంగా అమలయ్యేలా పట్టణ ఎస్హెచ్వో రామకృష్ణారెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి పోలీస్ సిబ్బంది పట్టణంలో పర్యటించారు. ఉదయం 10 గంటలకు వ్యాపారులు దుకాణాలను మూసివేసి లాక్డౌన్కు సహకరించారు.
లింగంపేట మండల కేంద్రంలో లాక్డౌన్ను పకడ్బందీగా నిర్వహించారు. వ్యాపారులు లాక్డౌన్ సమయానికి అనుగుణంగా దుకాణాలను తెరిచి ఉంచారు. శుక్రవారం సంత కావడం తో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కూరగాయలు విక్రయించడానికి మండలకేంద్రానికి తరలివచ్చారు. ఉదయం 10 గంటల అనంతరం అధికారులు దుకాణాలను మూసి వేయించారు.
నాగిరెడ్డిపేట్ మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. మండలకేంద్రంలోని అన్ని దుకాణాలను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచారు. ఉదయం 10 గంటల తర్వాత పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. జన సంచారం లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
జిల్లాకేంద్రంలో ఉదయం 6 నుంచి 10గంటలవరకు లాక్డౌన్ సడలింపు ఉండడంతో ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు పెద్దసంఖ్యలో బయటికి వచ్చారు. పలుచోట్ల భౌతిక దూరం పాటించలేదు. దోమకొండ మండల కేంద్రంలో లాక్డౌన్ను ఎస్సై రాజేశ్వర్గౌడ్ శుక్రవారం పర్యవేక్షించారు. ఉదయం 10 గంటలకు దుకాణాలను మూసి వేయించారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటికి రావాలని, లాక్డౌన్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఏఎస్సై లింబాద్రి, సిబ్బంది ఉన్నారు.బీబీపేట్ మండలంలో లాక్డౌన్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగింది. మండలకేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్మికులు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.