బీర్కూర్ : ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా చేరే విధంగా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట మాధవరావు సూచించారు. బీర్కూర్ మండలంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్నినిర్వహించారు. జిల్లాలోని ఉద్యోగులందరూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేయాలని తెలిపారు. స్త్రీశక్తి భవనంలో బతుకమ్మ చీరలు భద్రపరిచిన గిడ్డంగిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలానికి ఒకటి ఏర్పాటు చేయాలన్న బృహత్ ప్రకృతి వనం పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
సోమేశ్వర్ గ్రామం నుంచి నిజామాబాద్ జిల్లా సరిహద్దు బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామం వరకు, బీర్కూర్ కమాన్ నుంచి మైలారం గ్రామ శివారు వరకు రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసలలో మొక్కలను నాటి పూర్తి చేయాలన్నారు. మొక్కలకు ట్రీగార్డులు లేకుండా ఉండడంపై ఆయన సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలను మహిళలకు సక్రమంగా అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ రాజు, ఎంపీడీవో రాధ, సూపరింటెండెంట్ భరత్కుమార్, గిర్దావార్ శ్రీనివాస్, ఏపీఎం గంగాధర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.