దేవుడు వరమిచ్చినా.. పూజారి ఫలమివ్వని తీరుగా మారింది దివ్యాంగుల పరిస్థితి. వైకల్యంతో బాధపడేవారికి ప్రభుత్వం అండగా నిలిచేందుకు ఆసరా పింఛన్లు, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఈ పథకాల ద్వారా లబ్ధిపొందాలంటే తప్పనిసరిగా అధికారులు జారీచేసిన సదరం సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. వైద్యులు వైకల్యం శాతం నిర్ధారించిన అనంతరం సదరం సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఇందుకోసం ప్రతినెలా శిబిరాలను ఏర్పాటుచేసి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సదరం శిబిరాలకు హాజరయ్యేవారు ముందుగానే మీసేవ కేంద్రాల ద్వారా స్లాట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు తక్కువ సంఖ్యలో స్లాట్లను విడుదల చేయడంతో చాలా మంది బాధితులకు అవకాశం దక్కకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-ఎల్లారెడ్డి/చందూర్, ఫిబ్రవరి 3
గతంలో డివిజన్, మండలస్థాయిలో అప్పుడప్పుడు ప్రత్యేకంగా సదరం శిబిరాలను ఏర్పాటు చేసేవారు. మండలస్థాయిలో దరఖాస్తు చేసుకుంటే వారి సూచన మేరకు జిల్లా కేంద్రాల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసి సర్టిఫికెట్లను జారీ చేసేవారు. కొంతకాలంగా కేవలం జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రతినెలా కొన్ని స్లాట్లు విడుదల చేస్తున్నారు. కొన్ని కారణాలతో అప్పుడప్పుడు వీటిని కూడా రద్దు చేస్తున్నారు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో గతనెల 480 స్లాట్లను విడుదల చేశారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈనెల స్లాట్లను 780కి పెంచారు. కానీ, కామారెడ్డి జిల్లాలో ఈ నెల 280 స్లాట్లు మాత్రమే విడుదల చేయడంతో చాలా మందికి అవకాశం దక్కలేదు.
జిల్లా కేంద్రంలో సదరం క్యాంపునకు హాజరయ్యే ముందు మండల కేంద్రాల్లోనే పరీక్షలు నిర్వహించి అర్హత ఉన్నవారిని ఎంపిక చేయాలని బాధితులు కోరుతున్నారు. దీంతో అనర్హులను మండలస్థాయిలోనే నిలిపేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ విధానంతో అర్హులకు త్వరగా సదరం సర్టిఫికెట్ వస్తుందని అంటున్నారు. లేదంటే సదరం స్లాట్ల కోసం అష్టకష్టాలు తప్పడంలేదని వాపోతున్నారు. ఆర్థో, వినికిడి, చూపు, మానసిక వైకల్యం వంటి అంశాలకు సంబంధించి మండలస్థాయిలోనే గుర్తించి క్యాంపునకు పంపాలని కోరుతున్నారు.