ఖలీల్వాడి మార్చి 21 : కొత్త సంవత్సరాది అంటే సరికొత్త కాలానికి ఆరంభం. పండుగల్లో మొదటిది ఉగాది. చాంద్రమాసంలో ప్రతి ఏటా చైత్ర శుక్ల పాడ్యమి రోజున ఉగాది పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. బుధవారం శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ రోజున పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. మొదట ఉగాది పచ్చడి ఆరగించి శ్రవణాన్ని ఆరంభిస్తారు. ఉగాది పర్వదినంలో ప్రత్యేకంగా చెప్పుకునేది పచ్చడి. అందరినీ ఊరించే ఉగాది పచ్చడి షడ్రుచులసమ్మిళితం. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదును ఇముడ్చుకొని రుచిని పంచుతుంది పచ్చడి.
ప్రజలకు సభాపతి పోచారం, మంత్రి వేముల ఉగాది శుభాకాంక్షలు
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు చేకూరాలని, ఇంటిల్లి పాది ఉగాది పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండి రైతులు ఈ ఏడాదిలో
ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.
మార్కెట్లో సందడి..
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్కెట్లో సందడి నెలకొన్నది. మామిడి కాయలు, మామిడి కొమ్మలు, పూలను ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. నిజామాబాద్లోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో పురోహితుడు చిరంజీవాచార్యుల ఆధ్వర్యంలో పంచాగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాగమాలిక సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.