కామారెడ్డిరూరల్ : తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లి తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలుకు వ్యతిరేకించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నెలకొల్పిన కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు.
రైతులు ఒకే రకమైన పంటలు సాగు చేయకుండా వాణిజ్య పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం తెలంగాణ రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన అన్నారు. లింగాపూర్ గ్రామంలో రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ నిట్టు లింగారావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు సుగుణ, కాసర్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి నర్సారెడ్డి, రైతు సమన్వయ కమిటీ గ్రామ అధ్యక్షుడు బండారి రాంరెడ్డి, కౌన్సిలర్లు కృష్ణాజీరావు, గ్రామస్తులు నర్సారెడ్డి, బాగయ్య తదితరులు పాల్గొన్నారు.