కేసీఆర్ మహిళా బంధు పేరిట టీఆర్ఎస్ కార్యాచరణ
నేటి నుంచి మూడు రోజుల పాటు వినూత్న కార్యక్రమాలు
గులాబీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలతో కలిగిన ప్రయోజనాలపై విస్తృత ప్రచారం
నిజామాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. మహిళా సంక్షేమం, భద్రత, రక్షణ విషయంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. గడిచిన ఏడున్నరేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన వినూత్న కార్యక్రమాలతో మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సత్తా చాటుతున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశారు. అంగన్వాడీ, ఆశ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చింది. ఇందులో భాగంగా మహిళా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు రచించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘కేసీఆర్ మహిళా బంధు’ పేరుతో రాష్ట్ర మంతటా అంబరాన్నంటేలా ఈ నెల 6,7,8వ తేదీల్లో సంబురాలు నిర్వహించాలన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒకనాడు వంటింటికే పరిమితమైన మహిళలు కాల క్రమంలో దేశాన్ని నడిపించే మహా శక్తిగా ఎదిగారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక… ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ఓ వైపు ఇంటి పనులు, మరోవైపు చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ మహిళలు తమదైన ప్రతిభను చాటుతున్నారు. తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇతర జిల్లా విషయం ఏ విధంగా ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం మహిళల పాత్ర అత్యున్నతంగా నిలుస్తోందంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహం, సహకారమే కారణంగా చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఏడున్నరేండ్ల కాలంలో తీసుకు వచ్చిన వినూత్న పథకాలు మహిళలను సామాజికంగా పరివర్తనను తీసుకు వస్తున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, పారిశ్రామికంగా రాయితీలు, లోకల్ బాడీలో రిజర్వేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా కొండంత అండగా సర్కారు నిలబడుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లభించని మద్దతు కేసీఆర్ రూపంలో దొరుకుతుందంటే అతిశయోక్తి కాదు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమం నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనున్నది. ఇందులో భాగంగా గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహిళా సాధికారత లక్ష్యంతో…
తెలంగాణ మహిళా లోకం స్వశక్తితో ఎదగాలని, సాధికారత సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అనేకం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో వినూత్నమైన కార్యక్రమాలు మహిళా లోకానికి చేరుతున్నా యి. వడ్డీ లేని రుణాల దగ్గరి నుంచి మొదలు పెడితే కేసీఆర్ కిట్ దాకా అబలకు కొండంత అండ గా నిలుస్తున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలు సత్తా చాటే విధంగా రాష్ట్రంలో అనేక పథకాలను తీసుకువచ్చారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశారు. మహిళా శక్తిపై ప్రభుత్వానికి ఉన్న అపారమైన నమ్మకం మూలంగా ఇండస్ట్రియల్ పార్కుల్లో 10శాతం భూమిని కేటాయించాలనే నిబంధన ప్రత్యేకమైనది. కొత్త ఆలోచనలతో వచ్చే ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు వీ హబ్ మొదలు పెట్టింది. దేశంలో అత్యధికంగా మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్న రాష్ట్రమేదని అడిగితే టక్కున తెలంగాణ అని సగర్వంగా చెప్పే పరిస్థితులు వచ్చా యి. అంగన్వాడీ, ఆశ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చింది. స్థానిక సంస్థల్లో మహిళలకు ఇచ్చిన 50శాతం రిజర్వేషన్లు సీఎం కేసీఆర్ దార్శనితకతకు నిదర్శనం.
మహిళా బంధు సీఎం కేసీఆర్…
మహిళా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు రచించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేసీఆర్ మహిళా బంధు పేరుతో రాష్ట్ర మంతటా అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించాలన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మూడు రోజుల షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఆదివారం సంబురాలు ప్రారంభిస్తారు. తొలి రోజు సంబురాల్లో సీఎం కేసీఆర్కు రాఖీ కడతారు. పారిశుద్ధ్య కార్మికులు, మహిళా వైద్యులు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల సభ్యులను గౌరవ పూర్వకంగా సన్మానిస్తారు. కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పొందిన కుటుంబాలు, లబ్ధిదారులతో థాంక్యూ కేసీఆర్ ఆకారం వచ్చేలా మా నవ హారాలు ఏర్పాటు చేస్తారు. రెండో రోజైన ఏడో తారీఖున కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను వారి ఇండ్ల వద్దకు వెళ్లి కలవాలి. లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకుంటారు. చివరి రోజు ఉమెన్స్ డే సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశాలు, సంబురాలు నిర్వహిస్తారు.
ఘనంగా ఏర్పాట్లు…
కేసీఆర్ మహిళా బంధు సంబురాలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను గుర్తించి సన్మానించేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు. రాష్ర్టానికే స్ఫూర్తిగా నింపే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి నేతృత్వంలో అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ప్రత్యేకంగా మహిళా బంధు ప్రోగ్రామ్స్ నిర్వహించేలా ఏర్పా ట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన బాల్కొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మూర్లో పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి సైతం భారీ ఎత్తున మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్కు కృతజ్ఞత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరుగనున్నాయి. నిజామాబాద్ అర్బన్లో ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఇప్పటికే ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలకు సొంత ఖర్చుతో చీరలు పంపిణీ చేశారు. పార్టీ పిలుపు మేరకు 6, 7, 8 తేదీల్లోనూ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఆధ్వర్యంలో మహిళా బంధు కేసీఆర్ కార్యక్రమాలు జ రుగనున్నాయి.
బాన్సువాడలోని కోటగిరి, రుద్రూర్, చందూర్, వర్ని మండలాల్లో మహిళా దినోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో మహిళా బంధు కార్య క్రమాల నిర్వహణకు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాలుపంచుకోనున్నారు.