ఎల్లారెడ్డి రూరల్, మార్చి 20: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అబద్ధాలకోరు అని ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్ కుడుములు సత్యనారాయణ అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఆయన విడుదల చేసిన చార్జిషీట్ తప్పుల తడక అన్నారు. పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పుడు సమాచారంతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్కెట్ యార్డ్ విషయంలో ఎమ్మెల్యే సురేందర్ కమీషన్ తీసుకున్నాడని చార్జిషీట్లో ముద్రించారని, ఏఎంసీ నూతన చైర్మన్ నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభివృద్ధి పనుల నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఎల్లారెడ్డి ట్యాంక్బండ్ అభివృద్ధి ఎస్టిమేట్ రూ.ఐదు కోట్ల 41 లక్షలు అయితే.. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ జడ్పీటీసీలు రూ.15 కోట్ల నిధులు స్వాహా చేశారని చార్జిషీట్లో ముద్రించారని, ఇలా చేసినందుకు సిగ్గుపడాలన్నారు. నియోజకవర్గంలో పంపిణీ చేసిన, ప్రస్తుతం కడుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారన్నారు. సమావేశంలో జడ్పీటీసీ ఊషాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాశీనారాయణ, సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సతీశ్కుమార్, నాయకులు శ్రావణ్కుమార్, అశోక్రెడ్డి, మామి డి దామోదర్, భూంగారి రాము, దుద్దుల సాయిరాం, ఎరుకల సాయిలు, బాల్రాజ్గౌడ్, నాగం రాజయ్య, అరవింద్ గౌడ్ ఉన్నారు.