భిక్కనూరు, ఆగస్టు 5 : సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి అని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
అన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్షా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’ రాష్ట్రవ్యాప్త సైబర్ అవగాహన కార్యక్రమాన్ని భిక్కనూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుతం స్టాక్ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, ఫేక్ లింకులు, ఓటీపీ, కేవైసీ అప్డేట్, డిజిటల్ అరెస్ట్, నకిలీ కస్టమర్ కేర్ కాల్స్ వంటి సైబర్ మోసాలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కృత్రిమ మేధస్సు (AI) దుర్వినియోగంతో డీప్ఫేక్ వీడియోలు, నకిలీ వాయిస్ కాల్స్, తప్పుడు సందేశాలు, నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు, యువత, సోషల్ మీడియా వినియోగదారులు అపరిచితుల నుంచి వచ్చే లింకులు, ఉద్యోగాలు, పెట్టుబడి ప్రకటనలను ధృవీకరించకుండా నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారం, ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
ఆగస్టు నెలంతా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాలు తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ, భిక్కనూరు సీఐ, ఎస్ఐలు, సైబర్ క్రైమ్ అధికారులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.