616 మందికి షాదీముబారక్ చెక్కుల పంపిణీ
ఖలీల్వాడి, ఫిబ్రవరి 6 : నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆదివారం పర్యటించారు. అంతకుముందు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 616 మందికి మంజూరైన రూ. 6,16,71,456 విలువ చేసే షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆరుగురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఆరుగురికి మొత్తం రూ. 4,76,000 మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా అందజేస్తున్న రూ.1,00,116 పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయన్నారు.
క్రికెట్ విజేతలకు బహుమతుల ప్రదానం
నగరంలోని బోధన్రోడ్లో ఉన్న శైలజ గ్రౌండ్స్లో గత నెల 15వ తేదీ నుంచి కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. టోర్నమెంట్ను పాషా క్రికెట్, జీఆర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం విజేత జట్టుకు బహుమతులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ఖాన్ కుద్దూస్, రాఘవేందర్, సూదం రవి, రవిచందర్, అరుణ్, నవీద్ఇక్బాల్, అక్తర్, మతిన్ తదితరులు పాల్గొన్నారు.