భీమ్గల్, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంతో నిరుపేదల సొంతింటి కల సాకారమవుతున్నది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్లో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయింది. దీంతో అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి అందజేయడానికి ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేయనునారు.
అన్ని సౌకర్యాలతో 112 ఇండ్ల నిర్మాణం..
ఇక్కడ మొత్తం 112 ఇండ్లను అన్ని సౌకర్యాలతో నిర్మించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీకి కేసీఆర్ కాలనీగా పేరుపెట్టారు. ఈ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. మిషన్ భగీరథ నీరు, కరెంటు సదుపాయం కల్పించారు. పంపిణీకి ఇండ్లు సిద్ధం కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పేదల సొంతింటి కల నేరవెర్చారని.. ఎప్పటికీ కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
కలలో కూడా అనుకోలేదు
నా భర్త మా ఊరిలో ఫొటోగ్రాఫర్గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు. లాక్డౌన్ సమయంలో ఇంటి కిరాయి కట్టాలంటే చాలా ఇబ్బంది పడ్డాం. డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు ఇస్తామనడంతో చాలా సంతోషపడ్డాం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సొంతింటికి వెళ్తున్నాం. జీవితాంతం సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డికి రుణపడి ఉంటాం.
– బోనగిరి సుజాత, లబ్ధిదారు
రుణపడి ఉంటాం
మా పిల్లలను పట్టుకొని కిరాయి ఇండ్లలో ఉండి చాలా ఇబ్బంది పడ్డాం. డబుల్ బెడ్ రూం ఇల్లు రావడంతో మా కల నెరవేరుతున్నది. ఇప్పట్లో ఇండ్లు కట్టుకోవాలంటే మాకు అంత స్థోమత లేదు. అలాంటిది లక్షల విలువ చేసే ఇంటిని ఉచితంగా ఇచ్చి అందరిలో తలెత్తుకునేలా చేసిన సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డికి రుణపడి ఉంటాం.
–చిత్తరి లావణ్య, లబ్ధిదారు