కామారెడ్డి టౌన్: కొవిడ్ వ్యాక్సినేషన్ను వారం రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మండల స్థాయి అధికారులు, వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఆరోగ్య కార్యకర్త ప్రతిరోజు 50 మందికి వ్యాక్సినేషన్ చేసే విధంగా చూడాలన్నారు. మండల స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు వంద శాతం వ్యాక్సినేషన్ చేయించు కోవాలని కోరారు. శ్రీ నిధి రుణం బకాయిలు వసూలు చేయాలని ఐకేపీ అధికారులను ఆదేశించారు.
ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని వెల్లడించారు. జనవరి 1 , 2022 ప్రామాణికంగా తీసుకొని అప్పటి వరకు 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు కళాశాల యజమాన్యాలు అవగాహన కల్పించి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచే విధంగా పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జడ్పీ సీఈవో సాయాగౌడ్, అధికారులు పాల్గొన్నారు.