నిజామాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;2021, డిసెంబర్ 26.. ఇందల్వాయి మండలం గన్నారంలో ఎంపీ అర్వింద్ పర్యటన. పసుపుబోర్డు ఏర్పాటు చేయలేదని అడ్డగించిన రైతులపై వాహనాన్ని ఎక్కించి తీవ్రంగా గాయపర్చిన దుర్మార్గం. అన్నదాతల ఆగ్రహానికి గురైన ఎంపీ. కాషాయ పార్టీ నేతలతో ఘర్షణ. అర్వింద్ దాడుల సంస్కృతిలో కర్షకులకు తీవ్ర గాయాలు.
2022, జనవరి 25.. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో పసుపుబోర్డు ఏర్పాటు చేయాలంటూ అర్వింద్ను అడ్డగించిన రైతులు. అసహనంతో అర్వింద్ అనుచరుల దాడులు.. రైతులకు గాయాలు.
2022, ఫిబ్రవరి 19.. శివాజీ విగ్రహావిష్కరణ పేరిట ధర్పల్లిలో అర్వింద్ పర్యటన. ఆయనతో పసుపు బోర్డు హామీపై మాట్లాడేందుకు వచ్చిన పసుపు రైతులు. విషయం తెలుసుకొని అక్కడకు వెళ్లకుండానే కర్షకులపై దాడులను ప్రోత్సహించిన ఎంపీ. జెండాలు చేతపట్టి.. రాళ్లతో దాడులకు తెగబడిన వైనం. అన్నంపెట్టే రైతులకు తీవ్ర గాయాలు.
2023, మార్చి 10.. రాత్రి 7.40 గంటలకు నిజామాబాద్ శివారులో హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనంపై రాళ్ల దాడి. వాహనతో ప్రయాణిస్తున్నది బీజేపీ నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మీసాల చంద్రయ్య, ఇతర నేతలు. ప్రజల్లో అశాంతిని రేపేందుకు గంట గడవకముందే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు దాడి చేసినట్లుగా వికృత ప్రచారం. సీన్ కట్ చేస్తే.. దాడికి గురైన వారు, దాడి చేసిన వారంతా ఒకే పార్టీకి చెందిన వారే. సమాజంలో అశాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా బీజేపీ ఎంపీ పనిగా పెట్టుకున్నట్లు పైన ఉదహరించిన ఘటనలే సాక్ష్యం.
నిజామాబాద్ పేరు చెప్పగానే ప్రశాంతమైన, పచ్చటి పొలాలతో నిండిన వ్యవసాయ జిల్లాగా ఠక్కున గుర్తుకు వస్తుంది. అలాంటి ప్రాంతం కొంత కాలంగా తీవ్రమైన అలజడులకు వేదికగా మారింది. బీజేపీ ఎంపీ అర్వింద్ పోషిస్తున్న పాత్ర కారణంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షాలపై ఉసిగొల్పడంతోపాటు తనకు నచ్చని సొంత పార్టీవారిని కూడా లక్ష్యంగా చేసుకొని భౌతిక దాడులు చేయించడం ఆయనకు పరిపాటిగా మారింది. వారం క్రితం బీజేపీ రాష్ట్ర నాయకుడు మీసాల చంద్రయ్యపై దాడి ఉదంతమే ఇందుకు ఉదాహరణ. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో తెరవెనుక అర్వింద్ ఉన్నట్లు సొంత పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మరోవైపు ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్లుగా బీఆర్ఎస్ నాయకులపై నెపం నెట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం విడ్డూరం. ఈ వ్యవహారంపై డిచ్పల్లి పోలీసులు దర్యాప్తు చేసి దాడులకు తెగబడిన అర్వింద్ అనుచరులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దాడుల రాజకీయం..
బీజేపీ అధినాయకత్వం నుంచి క్షేత్ర స్థాయిలో పని చేసే కార్యకర్తల వరకు ఇష్టానుసారంగా దాడులకు తెగబడుతున్నారు. సొంత పార్టీ నాయకులపైనే దాడిచేసి ఇతరులకు బురద అంటిస్తున్నారు. యువతలో లేనిపోని ఉద్వేగాలను రెచ్చగొడుతున్నారు. బీజేపీ నీచ రాజకీయంపై ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ద్వారా రవ్వంత మేలు చేసేందుకు ముందుకు రాని బీజేపీ ఎంపీలు.. నిత్యం రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంలో ముందంజలో ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళం వినిపించడం అటుంచితే కనీసం సభలో కనిపించడం లేదు. కానీ, నిత్యం సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా నిజామాబాద్ నగరంలో అర్వింద్ అనుచరులు బీజేపీ నేతలపైనే దాడులకు తెగబడి హత్యానేరాలకు పాల్పడుతుండడంపై సొంత పార్టీతోపాటు ప్రజల్లోనూ వ్యతిరేకత వస్తున్నది.
అశాంతి సృష్టించడమే లక్ష్యం..
అర్వింద్ తీరుపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. అమలు సాధ్యం కాని హామీలిచ్చి ఎన్నికల్లో గట్టెక్కిన బీజేపీ అంటేనే రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పసుపుబోర్డు, పంటకు కనీస మద్దతు ధర రూ.15 వేలు, ఎర్రజొన్నకు మద్దతు ధర అంశాలన్నీ అటకెక్కించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. చైతన్యానికి ప్రతీకగా నిలిచే నిజామాబాద్ ప్రాంత ప్రజలు ఎంపీని వెంటాడుతూనే ఉన్నారు. హామీ ఏమైదంటూ నిలదీస్తున్నారు. నాలుగేండ్లుగాగా నిజామాబాద్కు అర్వింద్ చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటీ లేదు. పసుపుబోర్డు హామీపై ప్రశ్నిస్తే బీజేపీ నేతలు రైతులపైనే దాడులకు దిగుతున్నారు. పసుపుబోర్డు అంశాన్ని కనుమరుగు చేసి, శాంతిభద్రతల సమస్యలతో ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్రలు పన్నుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ప్రశాంతమైన నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేందుకు బీజేపీ ఎంపీయే కారణమని ఆరోపిస్తున్నారు.
అర్వింద్కు ప్రజలే బుద్ధి చెబుతారు..
ఎంపీ అర్వింద్ తీరుతో నిజామాబాద్ జిల్లా అపకీర్తి మూటగట్టుకుంటున్నది. మంచి నాయకులతో ఉమ్మడి రాష్ట్రంలోనే పేరొందిన ఈ ప్రాంతానికి ఆయన మూలంగా చెడ్డపేరు వస్తున్నది. అభివృద్ధి విషయంలో పోటీ పడాల్సిన ఎంపీ.. సోయి తప్పి ప్రవర్తిస్తున్నాడు. రాజకీయ లబ్ధి కోసం సామాన్యులను బలి పశువులను చేస్తున్నాడు. ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారు.
– చింత మహేశ్, తెలంగాణ ఉద్యమకారుడు
ప్రశాంత వాతావరణంలో చిచ్చు..
నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఎంపీ అర్వింద్ కారణంగా ఈ ప్రాంతం బురద రాజకీయాలకు కేరాఫ్గా మారింది. ఎంపీ మూలంగా అశాంతి ఏర్పడుతున్నది. అర్వింద్ తీరు మార్చుకొని ప్రజలకు సేవ చేయాలి. అంతేకాని ఉద్రిక్తతలను పెంచి పోషించడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం తప్పు.
– శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుడు