ఎల్లారెడ్డి రూరల్ : వర్షాకాలంలో నీరు నిలువ వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలోని నాలుగో వార్డు దేవునిపల్లి గ్రామంలో ఆయన ఇంటింటా తిరుగుతూ నిలువ నీటిని తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజలంతా వారి నివాస ప్రాంతాలలో వర్షపునీరు, నిలువ నీరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పాతటైర్లు, తాగి పడేసిన కొబ్డరి బోండాలు, వాడకంలో లేని వస్తువులలో నీరు నిలువ ఉంటే తక్షణమే ఆ నీటిని తొలగించాలని కోరారు.
వారంలో కనీసం రెండుసార్లయినా ఇంట్లోని నీరు నిలువ ఉంచుకునే కుండీలను గృహిణులు శుభ్రపరచుకోవాలన్నారు. ఆయనతో పాటు మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, నాలుగోవార్డు కౌన్సిలర్ ఎరుకల సాయిలు, అంగన్వాడీ టీచర్, నాయకులు ముత్తి రామప్ప, పరశురాం, శ్రీకాంత్, మహిళలు ఉన్నారు.