డిచ్పల్లి, మార్చి 26 : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్కు చెందిన హోంగార్డ్ కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఎస్సై గణేశ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ పట్టణానికి చెందిన కలకొట్ల భాస్కర్ (44) డిచ్పల్లి పోలీస్ బెటాలియన్లో హోంగార్డ్గా విధులు నిర్వహించేవాడు. భార్యా పిల్లలతో కలిసి బెటాలియన్ పక్కనే రాజారాం నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి పక్కనే ఉన్న కరెంటు వైర్లను ప్రమాదవశాత్తు తాకాడు. విద్యుత్ షాక్తో అక్కడే పడిపోయాడు. కొద్దిసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే బెటాలియన్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భాస్కర్ అప్పటికే మృతిచెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య ప్రియాంక, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. భాస్కర్ మృతదేహానికి బెటాలియన్ కమాండెంట్, సిబ్బంది నివాళులర్పించిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు వరంగల్కు తరలించారు.