కామారెడ్డి టౌన్ : అటవీ భూముల సంరక్షణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ భవనంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అటవీ భూములు సంరక్షణ, పోడు వ్యవసాయంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పోడు భూములు సాగు చేసిన రైతుల వివరాలను నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు అధికారులు సేకరిస్తారని వెల్లడించారు. అర్హులకు న్యాయం చేస్తామని చెప్పారు.
మానవ మనుగడకు అడవులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అటవీ, రెవెన్యూ అధికారులతో సంయుక్త సర్వే చేపడతామని పేర్కొన్నారు. అటవీ భూములను ఆక్రమించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఎఫ్ వో నిఖిత, ఆర్డీవో శీను, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, సూపరింటెండెంట్ వరప్రసాద్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.