బీర్కూర్: తల్లిదండ్రులను దైవంగా భావించే తాను వారి తరువాత ఆత్మీయులుగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే భావిస్తానని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో టీఆర్ఎస్ బీర్కూర్ మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రైతునగర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి పార్టీ కార్యకర్తలే ఆయువు పట్టు అని ఆయన తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు.
ఆఖరి ఊపిరి ఉన్నంత వరకూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసమే పని చేస్తానని, వారికి ఎలాంటి కష్టమొచ్చినా, దుఃఖం వచ్చినా తాను అండగా నిలబడతానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతుల వద్దకే స్వయంగా ఎరువులు, విత్తనాలు వెళ్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో లేవని అన్నారు.
కులమతాలను రెచ్చగొట్టి, మతకల్లోలను సృష్టించే బీజేపీ నాయకులకు గ్రామస్తులు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమానికి టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దుంపల రాజు అధ్యక్షత వహించగా మండలాధ్యక్షుడు లాడేగాం వీరేశం, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, ఏఎంసీ చైర్మన్లు ద్రోణవల్లి అశోక్, పాత బాలకృష్ణ, ఎంపీటీసీ సందీప్ పాటిల్, కోఆప్షన్ ఆరీఫ్, యూత్ అధ్యక్షుడు శశికాంత్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.