కామారెడ్డి, మార్చి 20 : పదేండ్లకోసారి ఆధార్, మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డీఎల్ఏఎంసీ సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఆధార్ను అప్డేట్ చేసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ఆధార్ను అప్డేట్ చేసుకోవడానికి రేషన్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటి వాటిని ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.
0-5 ఏండ్ల పిల్లలకు అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఆధార్ అప్డేట్ చేసుకొనే వీలుందని తెలిపారు. పాఠశాలలో చదివే ఆరు నుంచి 15 ఏండ్ల విద్యార్థులు ఎమ్మార్సీ భవనంలో అప్డేట్ చేసుకోవాలని చెప్పారు. 16 నుంచి 70 ఏండ్ల వరకు సీఎస్సీ కేంద్రంలో ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని సూచించా రు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, యూఐడీఏఐ అసిస్టెంట్ మేనేజర్ వినయ్, ఈ డిస్ట్రిక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ రమేశ్, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో 106 పల్లె దవాఖానలు మంజూరు
కామారెడ్డి జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల పరిధిలో 106 పల్లె దవాఖానలు మంజూరయ్యాయని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. వాటిలో ఇప్పటి వరకు 62 పల్లె దవాఖానలకు రంగులు వేసి పనులను అధికారులు పూర్తి చేయించారని అన్నారు. సోమవారం అధికారులతో పల్లె దవాఖానలకు రంగుల వేయడంపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. 37 ప్రభుత్వ, 25 ప్రైవేట్ భవనాలకు రంగులు వేశారని చెప్పారు. ఇంకా 14 ప్రభుత్వ భవనాలు, 30 ప్రైవేట్ భవనాలకు రంగులు వేయాలని అధికారులకు సూచించారు. జూమ్ సమావేశంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్సింగ్, ప్రోగ్రాం అధికారులు శోభారాణి, చంద్రశేఖర్, శిరీష, పద్మజ, చలపతి పాల్గొన్నారు.