వేల్పూర్, మార్చి 18 : బీఆర్ఎస్ ప్రభుత్వం కులసంఘాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లోని 88 కుల సంఘాల భవనాలకు ప్రభుత్వం రూ.4.14 కోట్ల నిధులు మంజూరు చేసింది. వీటికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను వేల్పూర్లోని తన నివాసంలో కుల సంఘాల సభ్యులకు శనివారం అందజేశారు. మెండోరా మండలంలో 10 కుల సంఘాల భవనాలకు రూ.46 లక్షలు, ముప్కాల్లో నాలుగు కులసంఘాల భవనాల నిర్మాణాలకు రూ.13లక్షలు, ఏర్గట్లలో నాలుగు కుల సంఘాల భవన నిర్మాణాలకు రూ.13.50 లక్షలు, వేల్పూర్ మండలంలో 13 కుల సంఘాల భవనాలకు రూ.కోటీ8 లక్షలు, మోర్తాడ్ మండలంలో రెండు కుల సంఘాల భవనాలకు రూ. 37 లక్షలు, కమ్మర్పల్లి మండలంలో 11 కుల సంఘాల భవనాలకు రూ.51.50 లక్షలు, భీమ్గల్ మండలంలో 22 కుల సంఘాల భవనాలు రూ.కోటీ 5 లక్షలు, బాల్కొండ మండలంలో 9 కుల సంఘాల భవనాలకు రూ.40.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మంత్రిని కుల సంఘాల సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
నేడు జిల్లాలో మంత్రి పర్యటన
మంత్రి వేముల ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు భీమ్గల్ మండలం బడాభీమ్గల్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం గృహ నిర్మాణాల సముదాయాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పత్రాలను అందజేస్తారు. 11 గంటలకు మోర్తాడ్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మోర్తాడ్ నుంచి 16వ నంబర్ జాతీయ రహదారి వరకు రూ.2.20 కోట్లతో బద్దం వాడ రోడ్డు ప్రత్యేక మరమ్మతులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి బద్దంవాడ కమ్మర్పల్లి అప్రోచ్రోడ్డు ప్రత్యేక మరమ్మతులకు (రూ.1.60 కోట్లు) శంకుస్థాపన చేస్తారు. మోర్తాడ్ నుంచి కమ్మర్పల్లి వయా వడ్యాట్ వరకు రోడ్డు మరమ్మతులకు రూ.45 లక్షలతో చేపట్టనున్న పనులకు, మోర్తాడ్ పెద్దమ్మ గుడి వద్ద రూ.15 లక్షలతో రిటైనింగ్ వాల్ ప్రత్యేక మరమ్మతు పనులకు శంకుస్థాపన చేస్తారు.