మెండోరా, డిసెంబర్ 25 : ఎస్సారెస్పీ నుంచి లక్ష్మీ కాలువకు ప్రజాప్రతినిధులు, అధికారులు శనివారం నీటిని విడుదల చేశారు. టీఆర్ఎస్ ముప్కాల్ మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్, ఎస్ఈ కరుణాకర్ హెడ్ రెగ్యులేటర్ వద్ద పూజలు చేసి గేట్లుఎత్తి లక్ష్మీ కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ.. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవతో నీటి విడుదలను ప్రారంభించామన్నారు. మంత్రికి రైతుల తరఫున వారు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీ కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈఈ లింబాద్రి తెలిపారు. 25,780 ఎకరాలకు మే నెల వరకు నీటివిడుదల కొనసాగుతుందన్నారు. ఆయకట్టు రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఈఈ భానుప్రకాశ్రెడ్డి, డీఈ సురేశ్, ఏఈఈలు శేఖర్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న నీటివిడుదల
కాకతీయ కాలువకు 100, వరద కాలువకు 700, లక్ష్మీ కాలువకు 50 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని ఏఈఈ భానుప్రకాశ్ తెలిపారు. మిషన్ భగీరథ తాగునీటి కోసం 152 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.60 అడుగులు( 88.912 టీఎంసీ) ఉందని ఏఈఈ వివరించారు.