నవీపేట, జూలై 15: జిల్లాలో నాలు గు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాళేశ్వర్-తల్వేద బ్రిడ్జి అప్రోచ్వాల్ కూలిపోయింది. దీంతో నవీపేట-నందిపేట మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. పద్దెనిమిది ఏండ్ల క్రితం నవీపేట-నందిపేట మండలాల్లోని పలు గ్రామాలకు రాక పోకలు మెరుగు పర్చేందుకు నాళేశ్వర్-తల్వేద గ్రామాల మధ్యలో ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం అప్పటి ప్రభుత్వం చేపట్టింది. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి అంచున నిర్మాణం చేపట్టిన అప్రోచ్వాల్ కుంగిపోయింది. దీంతో బ్రిడ్జిపై బీటీ రోడ్డు కోతకు గురై సగం తెగి పోయింది. దీంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విష యం తెలుసుకున్న సర్పంచ్ ద్యాగ సరిన్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు సమాచారం అందజేశారు. త్వరితగతిన పనులు చేపట్టి రాక పోకలు సాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు.
మరమ్మతులు చేపట్టాలని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ ఆదేశం
వరద తాకిడికి నాళేశ్వర్-తల్వేద బ్రిడ్జి కూలిపోయిందన్న సమాచారం వాట్సాప్ ద్వారా తెలుసుకున్న నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు స్పందించారు. బ్రిడ్జి మరమ్మతు పనులు వెంటనే చేపట్టి నవీపేట-నందిపేట మండలాల మధ్య రాకపోకలను పునరుద్ధరించాలని పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో పీఆర్ డిప్యూటీ ఈఈ రాజయ్య, ఏఈ శ్రావణ్ బ్రిడ్జి వద్దకు చేరుకొని అప్రోచ్ వాల్ వద్ద నాళేశ్వర్ గ్రామస్తుల సహకారంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. పనులు శుక్రవారంలోగా పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారని పీఆర్ డిప్యూటీ ఈఈ రాజయ్య తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.