నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 11: జిల్లాలోని వివిధ గ్రామాల్లో బతుకమ్మను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. గతేడాది కరోనా కారణంగా వేడుకలకు దూరంగా ఉన్న ప్రజలు.. ఈ సారి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో చిన్నాపెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ చావిడీల వద్ద, ఆలయాల వద్ద మహిళలు సామూహికంగా పాటలకు అనుగుణంగా లయబద్ధంగా ఆడిపాడారు. అనంతరం చెరువుల్లో నిమజ్జం చేశారు. మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా బతుకమ్మలు ఆడే ప్రాంతాల్లో, చెరువుల వద్ద గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
నిజాంసాగర్ మండలంలోని గోర్గల్లో ఎంపీపీ పట్లోల్ల జ్యోతి దుర్గారెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. బిచ్కుంద మండలం వాజిద్నగర్లో బతుకమ్మ పండుగను సర్పంచ్ అనూయ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిట్లంలో అట్ల బతుకమ్మను సోమవారం ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో సోమవారం అట్ల బతుకమ్మ పండుగను నిర్వహించారు. మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని ఉన్న అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి బతుకమ్మ వేడుకను నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్న ధర్మశాల, విద్యానగర్లోని సాయిబాబా ఆలయం, పంచముఖి హనుమాన్ ఆలయం, సాందీపని డిగ్రీ కళాశాల ఆవరణలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ, మండలంలోని వివిధ గ్రామాల్లో అట్ల బతుకమ్మ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్..
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బతుకమ్మ సంబురాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగినులు ఆడి పాడారు. సంబురాల్లో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు పాల్గొన్నారు. అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అలంకరించిన బతుకమ్మ ప్రథమ స్థానంలో, బీసీ వెల్ఫేర్ బతుకమ్మ ద్వితీయ, ఎస్సీ వెల్ఫేర్ బతుకమ్మ తృతీయ స్థానంలో నిలిచాయి. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి సరస్వతి, జిల్లా రవాణా శాఖ అధికారిణి వాణి, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి శైలజ, టీఎన్జీవోస్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిలు, ప్రతినిధులు పాల్గొన్నారు.