ఇందూరు, ఆగస్టు 6 : బృహత్ పార్కుల్లో ఈ నెల 9వ తేదీ నుంచి ప్లాంటేషన్ పనులను ప్రారంభించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి బృహత్ వనాలు, హెల్త్ సర్వే. టీఎస్ బీపాస్, ఎస్సీ, ఎస్టీ వాడల్లో మౌలిక సదుపాయాల సర్వేపై మున్సిపల్, మండలస్థాయి అధికారులతో మాట్లాడారు. అన్ని మండలాల్లో బృహత్ పార్కులను ఏర్పాటు చేసేందుకు మొక్కలు నాటాలన్నారు. 31 వేల మొక్కల లక్ష్యాన్ని ఎంపీడీవోలు శ్రద్ధతో పూర్తి చేయించాలన్నారు. ప్రతి మండలంలో ఈనెల 15కు అన్ని పనులను పూర్తిచేసి సంబంధించిన వీడియోలు తీసి తనకు పంపించాలని ఆదేశించారు. 63వ నంబర్ జాతీయ రహదారి వెంబడి ప్లాంటేషన్ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. పీఆర్, ఆర్అండ్బీ రోడ్లపై మొక్కల మధ్య ఖాళీ స్థలాలు ఉండకుండా చూడాలన్నారు. ఏవైనా అక్రమ కట్టడాలుంటే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని మండలాల్లోని ఎస్సీ, ఎస్టీ వాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మిషన్ భగీరథ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. హెల్త్ సర్వే త్వరలోనే పూర్తవుతుందని, అవసరమున్న చోట సోమవారం కూడా నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా, నగర మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, ఎఫ్డీవో సునీల్, జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ పాల్గొన్నారు.
రెండు రోజుల్లో హెల్త్ సర్వే పూర్తి
ఇందూరు, ఆగస్టు 6 : జిల్లాలో ఈ నెల 3 నుంచి చేపట్టిన హెల్త్ సర్వే మరో రెండు రోజుల్లో పూర్తి కానుందని, ఇందుకు ప్రజలు కూడా మంచి సహకారం అందిస్తున్నారని కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పూర్తిస్థాయిలో తెలుసుకుని వారికి అవసరమైన చికిత్స అందించడానికి సర్వే చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు 62 శాతం వివరాల సేకరణ పూర్తయిందని తెలిపారు. జిల్లాలోని 2 లక్షల 17 వేల కుటుంబాల వివరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. వివిధ వ్యాధి లక్షణాలున్న వారికి పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, చికిత్స అందించనున్నట్లు తెలిపారు.