బాల్కొండ నియోజకవర్గంలోని దవాఖానల్లో ఆ కొరతను అధిగమించాం
సతీమణి, స్నేహితుల ఆర్థికసాయంతో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు
కమ్మర్పల్లి, చౌట్పల్లి, భీమ్గల్ పీహెచ్సీల్లో ఆక్సిజన్ బెడ్లు, ఆధునికీకరించిన దవాఖానలను ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
కమ్మర్పల్లి/భీమ్గల్,జనవరి 4: ఆక్సిజన్ అందక ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనేదే తన తపన అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తన సతీమణి నీరజారెడ్డి, స్నేహితులు అందించిన రూ.కోటి 50 లక్షల ఆర్థిక సహాయంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బాల్కొండ నియోజక వర్గంలోని అన్ని పీహెచ్సీల్లో కలిపి 102 ఆక్సిజన్ బెడ్లు, 18 ఐసీయూ మానిటరింగ్ బెడ్ల సౌకర్యంతో పాటు మౌలిక వసతులను కల్పించారు. ఇందులో భాగంగా కమ్మర్పల్లి పీహెచ్సీలో ఏర్పాటు చేసిన ఆరు ఆక్సిజన్ బెడ్లు, వాటర్ ప్లాంట్, రిసెప్షన్ ఏరియా సెంటర్, చౌట్పల్లి పీహెచ్సీలో ఏర్పాటు చేసిన ఐదు ఆక్సిజన్ బెడ్లు, రిసెప్షన్ సెంటర్, వాటర్ ప్లాంట్, ఆపరేషన్ థియేటర్లో సదుపాయాలు, భీమ్గల్ పీహెచ్సీలో ఆరు ఆక్సిజన్ బెడ్లు, మినరల్ వాటర్ ప్లాంట్ను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వేళ ఎందరో పేదలు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారన్నారు. తన కండ్ల ముందే ఆత్మీయులు కూడా చనిపోయారన్నారు. ఆ బాధను చూసి తన నియోజకవర్గంలో ఆక్సిజన్ అందక ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదనే ఆలోచన వచ్చిందన్నారు. వెంటనే తన ఆలోచనను స్నేహితులు, తన సతీమణితో పంచుకున్నానని గుర్తుచేశారు.
దీనికి వారు తక్షణమే స్పందించి నియోజక వర్గంలోని దవాఖానల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, ఇతర సౌకర్యాల కల్పనకు రూ.కోటీ 50 లక్షల ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. వారి సహాయంతో అన్ని దవాఖానల్లో 102 ఆక్సిజన్ బెడ్లు, మోర్తాడ్, బాల్కొండ, వేల్పూర్ దవాఖానల్లో 18 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. మోర్తాడ్లో రూ.60 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడే ఆక్సిజన్ను బాట్లింగ్ చేసి నియోజక వర్గంలోని ఇతర పీహెచ్సీలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అన్ని పీహెచ్సీల్లో పేషెంట్లకు సౌకర్యవంతంగా రిసెప్షన్ ఏరియా సెంటర్లు, ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని వివరించారు. అన్ని దవాఖానల్లో ఆక్సిజన్ సౌకర్యం ఉండడంతో మూడో వేవ్ వచ్చినా పేదలకు మెరుగైన వైద్యం ఇక్కడే అందించే అవకాశం కలిగిందన్నారు. ఇంత గొప్ప పని చేయడానికి అడగ్గానే తనకు సహకరించిన తన స్నేహితులు, తన సతీమణికి నియోజక వర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఓ స్నేహితుడి సహకారంతో రూ.27 లక్షలతో ఐసీయూ సౌకర్యాలతో కూడిన అంబులెన్సు వాహనాన్ని సైతం నియోజక వర్గ ప్రజల కోసం అందించామని చెప్పారు. అది ఇప్పుడు మోర్తాడ్ కేంద్రంగా 108 ఆధ్వర్యంలో సేవలు అందిస్తోందని తెలిపారు.
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
భీమ్గల్లో ఇటీవల ఎమ్మెల్సీ కవితతో కలిసి ప్రారంభించిన నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులను మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కమ్మర్పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో డీఎంహెచ్వో సుదర్శనం, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్, ఆర్డీవో శ్రీనివాస్, ఎంపీపీ లోలపు గౌతమి, జడ్పీటీసీ పెరుమాండ్ల రాధ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు భాస్కర్ యాదవ్, మెడికల్ ఆఫీసర్లు స్వామి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మలావత్ ప్రకాశ్, సర్పంచులు గడ్డం స్వామి, మారు శంకర్, సక్కారం అశోక్, పుప్పాల గంగాధర్, ఎంపీటీసీలు మైలారం సుధాకర్, ఏశాల నర్సయ్య, దుబ్బాక సుప్రియ, పిప్పె అనిల్, రైతు బంధు మండల కో-ఆర్డినేటర్ బి.రాజేశ్వర్, కుంట ప్రతాప్, బట్టు అశోక్, పెరుమాండ్ల రాజా గౌడ్, లోలపు సుమన్, ఏనుగు రాజేశ్వర్, నోముల నరేందర్, అజ్మత్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్లో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, తహసీల్దార్ రాజేందర్, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అజయ్ పవార్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, ఎంపీడీవో రాజేశ్వర్, వైస్చైర్మన్ భగత్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ శర్మనాయక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ పాల్గొన్నారు.