నిజామాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ నేతల తీరుపై టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు తంబాకు సంజయ్ అయితే బీజేపీ ఎంపీ గంజాయి అర్వింద్ అంటూ నిప్పులు చెరిగారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావుతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ బ్రోకర్, జోకర్ పార్టీగా మారిందన్నారు. ఎల్లమ్మ తల్లిని కించపర్చిన నిజామాబాద్ ఎంపీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్లీనరీని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని జీవన్రెడ్డి వెల్లడించారు.
బ్రోకర్, జోకర్ పార్టీ బీజేపీ అని టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తంబాకు సంజయ్ అయితే ఆ పార్టీకి ఎంపీ గంజాయి అర్వింద్ అని అభివర్ణించారు. చిచోర, చిల్లర, చీప్ క్వాలిటీ వ్యక్తులంటూ నిప్పులు చెరిగారు. ఎల్త్రీ, బీత్రీ, ఎఫ్త్రీ నుంచి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ సీత్రీలుగా మారారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లిని కించపర్చిన నిజామాబాద్ ఎంపీ బేషరతుగా నందిపేట మండలం కుద్వాన్పూర్ ఎల్లమ్మ తల్లి దేవాలయం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 27న హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగే ప్లీనరీని పండుగ వాతావరణంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్నదని వెల్లడించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడడం, హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం అర్వింద్కు మొదటి నుంచి అలవాటేనని అన్నారు. 2023 ఎన్నికల్లో అర్వింద్ను ఎల్లమ్మ తల్లి తప్పకుండా రాజకీయంగా బలి తీసుకుంటుందని చమత్కరించారు. కుద్వాన్పూర్ ఎల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్ దేవత అని చెప్పారు. ఎల్లమ్మ తల్లి విషయంలో నోటికొచ్చినట్లు వాగిన ఎంపీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో బలి తీస్తారని ఎద్దేవా చేశారు. 14 ఏండ్లు వనవాసం చేసిన రాముడిలా, 14 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్ నేటి తరానికి అసలైన రాముడంటూ అభివర్ణించారు.
బ్లేడ్ బాబ్జీగా ఎంపీ అర్వింద్…
బీజేపీ ఎంపీ అర్వింద్పై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వదిలారు. చాలా రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి బ్లేడ్ బాబ్జీల సెంటిమెంట్ కలిసి వస్తోందంటూ చెప్పారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోకపోతే బ్లేడ్తో గొంతు కోసుకుంటానని బండ్ల గణేశ్ చెప్పాడంటూ వివరించారు. సీపీఐ నారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఇదే విధంగా సవాళ్లు విసిరి టీఆర్ఎస్ ధాటికి కొట్టుకుపోయారన్నారు. వీరంతా బ్లేడ్ బాబ్జీలుగా ప్రఖ్యాతిగాంచారని చెప్పుకొచ్చారు. వీరి సరసన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేరాడని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలువకపోతే బ్లేడ్తో గొం తు కోసుకుంటానని చెప్పడంపై టీఆర్ఎస్ అధ్యక్షుడు తనదైన శైలిలో చమత్కరించారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోమారు ప్రభంజ నం సృష్టిస్తుందన్నారు. ఎమ్మెల్యేలందరూ 50 వేల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి డిపాజిట్లు రావని జోస్యం చెప్పారు. బ్లేడ్తో గొంతు కోసుకునేందుకు అర్వింద్ సిద్ధంగా ఉండాలన్నారు. బండ్ల గణేశ్, సీపీఐ నారాయణలను మానవత్వంతో వదిలేసినప్పటికీ అర్వింద్ను గొంతు కోసుకునే దాకా వదిలి పెట్టే పరిస్థితి ఉండదన్నారు. అర్వింద్కు సిగ్గుంటే పసుపు బోర్డు తేలేక పోయినందుకు గొంతు కోసుకోవాలన్నారు. వరి, పసుపు రైతులతో పాటు దళితులను అవమానపర్చినందుకు అర్వింద్ గొంతు కోసేందుకు ఆ వర్గాలన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
పండుగలా ప్లీనరీ…
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు జీవన్ రెడ్డి చెప్పారు. పార్టీ అధినాయకత్వం ఆహ్వానం మేరకు నిజామాబాద్ జిల్లా నుంచి ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగే ప్లీనరీకి హాజరవుతారన్నారు. ఈ నెల 27న గ్రామాలు, వార్డులు, డివిజన్లలో గులాబీ జెండాను ఎగురవేయాలని చెప్పారు. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీల కన్నా మిన్నగా టీఆర్ఎస్కు 65 లక్షల మంది కార్యకర్తల బలం సొంతమ ని వివరించారు. టీఆర్ఎస్ను ఢీకొట్టే దమ్ము బీజేపీకి లేదన్నారు. ఎంపీ అర్వింద్పై నిజామాబాద్లో సొంత పార్టీ లీడర్లే తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు. అంతర్గత సమావేశాల్లో ఎంపీని బండ బూతులు తిట్టారని తెలిపారు. సొంత పార్టీ నాయకులే ఛీ కొడుతున్నప్పటికీ అర్వింద్కు బుద్ధి రావడం లేదన్నారు. బూత్ స్థాయిలో ప్రతినిధులు కరువైన బీజేపీకి నిజామాబాద్లో నాలుగైదు గ్రూపులుండడం విడ్డూరమంటూ ఎద్దేవా చేశారు. సమావేశంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుజీత్సింగ్ ఠాకూర్, అలీం తదితరులు పాల్గొన్నారు.