ప్రైవేటు దవాఖానలకు కామారెడ్డి కలెక్టర్ శరత్ సూచన
జిల్లాలో కరోనా చికిత్స కోసం 46 వైద్యశాలలకు అనుమతి
విద్యానగర్, ఏప్రిల్ 15 : వైద్యం కోసం వచ్చిన రోగులకు మెరుగైన సేవలు అందించాలని ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలకు కామారెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐఎంఏ భవనంలో గురువారం ప్రైవేట్ దవాఖానల వైద్యులకు కొవిడ్ చికిత్సపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్నదని, కొవిడ్ చికిత్స అందించేందుకు జిల్లాలోని 46 ప్రైవేట్ దవాఖానలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. సగం బెడ్లు కరోనా చికిత్స కోసం కేటాయించాలని, ప్రతి రోజూ కొవిడ్ చికిత్స, బెడ్స్ ఆక్యుపెన్సీ వివరాలను జిల్లా వైద్య శాఖకు నివేదిక సమర్పించాలని అన్నారు. ఐఎంఏ తరఫున ఒక కొవిడ్ సెంటర్ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అజయ్కుమార్ కలెక్టర్కు తెలిపారు. ఇందుకు అసోసియేషన్ సభ్యులను కలెక్టర్ అభినందిస్తూ, తమవంతు సహాయ సహకారాలను అందజేస్తామన్నారు. అనంతరం డీఎంహెచ్వో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కొవిడ్ చికిత్సకు అనుసరించాల్సిన ని బంధనలను వివరించారు. ఎంపిక చేసిన దవాఖానలకు అనుమతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు జయచందర్, శ్రీనివాస్ రావు, ప్రవీణ్ కుమార్, అరవింద్ కుమా ర్, వెంకటేశ్వర్ గౌడ్, మల్లికార్జున్, నరేందర్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.