ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దు
జిల్లాలో లేని సంస్కృతిని తెచ్చావు..
ప్రజా సమస్యలపై దృష్టి సారించు..
టీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే రాళ్లతో కొడుతాం
నిప్పులు చెరిగిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి
ఆర్మూర్, ఫిబ్రవరి 20 : ఎంపీ అర్వింద్ తీరుపై టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఆదివారం విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధికార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్ జిల్లాకు పట్టిన దరిద్రమని, జిల్లాలో ఏనాడూ లేని విద్వేషాలను రెచ్చగొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీర శివాజీ విగ్రహం సాక్షిగా దగుల్బాజీ వేషాలు వేసి మత విద్వేషాలు రెచ్చగొట్టాడని ఆరోపించారు. చేతనైతే ప్రజా సమస్యలు పరిష్కరించాలని, దమ్ముంటే నిధులు తెచ్చి జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి నిష్క్రమించాలని హితవు పలికారు. పిడికెడు మంది లేని బీజేపీ కార్యకర్తలతో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయించిన అర్వింద్ను వదిలేది లేదని స్పష్టం చేశారు. 62 లక్షల గులాబీ సైన్యం ఉఫ్ మని ఊదితే గాలిలో దూది పింజాల్లా లేచిపోతారని, ధర్పల్లి, మంచిప్ప గ్రామాల్లో రైతులపై బీజేపీ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గాయపడిన బాధితులకు అండగా ఉంటామన్నారు.
అర్వింద్ ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, బట్టేబాజ్ ఎంపీ అని, పసుపు బోర్డు తేకుండా రైతులను ముంచిన ఆయన ఏ గ్రామంలోనూ అడుగు పెట్టలేడని అన్నారు. ఎంపీ అర్వింద్ది చిల్లర బతుకని, చిల్లర భాష అని ధ్వజమెత్తారు. మళ్లీ గెలవనని, ఇక బీజేపీ రాదని, రాజకీయాల్లో నూకలు చెల్లినట్టేనని తీవ్ర అసహనానికి లోనవుతున్న అర్వింద్ పిచ్చెక్కి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్పై అవాకులు చెవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఏ రోటి కాడ ఆ పాట పాడుతున్నారని విమర్శించారు. దమ్ముంటే కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకురావాలని, చిల్లర రాజకీయాల కోసం ప్రజల మధ్య పంచాయితీ పెట్టవద్దని హితవు పలికారు. 24 గంటల పాటు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని, గన్మెన్ లేకుండా అడుగు తీసి అడుగు వేయలేయలేని పరిస్థితి ఆయనకు దాపురించిందన్నారు. అరాచకాలు సాగడం లేదని పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్న ఎంపీపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలను మోసం చేస్తున్న బీజేపీని ఇంటికి పంపడానికి కేసీఆర్ నడుం బిగించారన్నారు.