భీమ్గల్, మార్చి 26 : ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగలా సాగుతున్నాయి. పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా తరలివస్తున్నారు. పార్టీ కార్యకర్తలను ప్రజాప్రతినిధులు పేరుపేరునా పిలుస్తూ..ఆప్యాయతను పంచుతున్నారు. ఏ కష్టమొచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో మమేకమవుతూ.. స్వయంగా భోజనాలను వడ్డించి, వారితో పాటు భోజనాలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆదివారం బాల్కొండ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్ట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తన సతీమణి నీరజారెడ్డితో కలిసి హాజరయ్యారు. రామారెడ్డిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, జిల్లా ఇన్చార్జి విఠల్, బిచ్కుంద మండలం వాజిద్నగర్లో ఎమ్మెల్యే షిండే ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.
తన కుటుంబం కన్నా.. బీఆర్ఎస్ కుటుంబమే తనకు మిన్న అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ అండ, లింబాద్రి నృసింహుడి ఆశీస్సులతో బాల్కొండ నియోజకవర్గంలో కొండంత అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. భీమ్గల్ మండలం లింబాద్రి గుట్ట వద్ద ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తన సతీమణి నీరజారెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమ్మేళనానికి మండలంలోని పల్లికొండ, పిప్రి, బాచంపల్లి, మెండోరా, రహత్ నగర్, ముచ్కూర్, బెజ్జోరా, దేవక్కపేట్, బాబానగర్, లింగాపూర్ చౌత్, దేవన్పల్లి, గంగరాయి, తాళ్లపల్లి, కారెపల్లి గ్రామాల నుంచి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటంలో కార్యకర్తల భూమిక గొప్పదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అనతి కాలంలోనే దేశంలోన నంబర్వన్గా నిలిపారన్నారు. మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు అరి గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రజలకు డబ్బులు పంపిస్తుంటే.. మోదీ ధరలు పెంచి డబ్బులు గుంజుకుంటున్నాడని విమర్శించారు. కేసీఆర్తో తనకు ఉన్న సాన్నిహిత్యంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధికి ఎలాంటి లోటు లేదన్నారు. ప్యాకేజీ-21తో భీమ్గల్ భూములకు కాళేశ్వరం జలాలు అందనున్నాయని తెలిపారు. మూడెకరాలకు ఒక బోరులాంటి సౌకర్యం కలిగే ప్యాకేజీ-21 పనులు చివరి దశకు చేరాయని, రైతులు ఒక్కసారి సీజన్కు సహకరిస్తే నీళ్లు అందించడం ప్రారంభిస్తామన్నారు. వరద కాలువ గుండా కాళేశ్వరం జలాలను ఉల్టా ప్రవహింప జేసే అవకాశాన్ని కేసీఆర్కు విన్నవించినట్లు తెలిపారు. పునర్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాలు బటన్ నొక్కితే వచ్చేలా చేశామని గుర్తు చేశారు. ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాలు అందే సౌకర్యం ఉందని, ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి ప్యాకేజీ -21కు నీటికి ఢోకా ఉండదని వివరించారు. తాను, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విన్నవించడంతో కాలువ స్థానం లో పైపు లైన్ ఇచ్చి రైతు ల భూములను కేసీఆర్ కాపాడారన్నా రు. కప్పల వాగు, పెద్ద వాగుల్లోని చెక్ డ్యాముల్లో కూడా కాళేశ్వరం జలాలు నింపుకొందామన్నారు. వేముగంటి ప్రాజెక్టుపై కాంగ్రెస్ వారు అబద్ధాలు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ఆ ప్రాజెక్టుకు స్టేజ్-2 క్లియరెన్స్ తెచ్చింది, చెరువులను లింకు చేసేందుకు కృషి చేసింది తామేనని పేర్కొన్నారు. కేసీఆర్ దయతో రోడ్ల మంత్రిని అయ్యను కాబట్టి రోడ్ల అభివృద్ధి బ్రహ్మండంగా జరుగుతుందన్నారు.
ఎంపీ అర్వింద్ను నిలదీయాలి..
ఏమీ చేయని వారే అన్ని చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. గెలిపించిన ప్రజల కోసం పదవిలో ఉన్నప్పుడు ఏం చేశామన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. తాను ఆ పాయింట్ను నమ్మి పని చేస్తున్నానని చెప్పారు. బుగ్గ కారులో ఉత్తగానే కాలం గడిపేస్తే.. అదీ ఒక బతుకేనా అని వ్యాఖ్యానించారు. మూడు సింహాలున్న బాండ్ పేపర్కే విలువ లేకుండా చేసిన ఎంపీ అర్వింద్ను గ్రామాల్లోకి వస్తే ప్రజలే నిలదీయాలని పిలుపునిచ్చారు.ఎంపీగా ఎన్ని నిధులు తెచ్చావని, ఏం అభివృద్ధి చేశావని, ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి ఎంత మందికి ఆర్థిక సాయం అందించావని ప్రశ్నించారు .కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసత్య ప్రచారాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని సూచించారు. ఆత్మీ సమ్మేళనానికి ఇంటిల్లి పాదితో వచ్చిన బీఆర్ఎస్ కుటంబ సభ్యులు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్కు బలం, బలగం కార్యకర్తలే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని మంత్రి వేముల తెలిపారు. పార్టీ అధినేత పట్ల పూర్తి విధేయత, పార్టీ కార్యకర్తలను కుటంబ సభ్యుల్లా చూసుకోవడం, ఎన్నుకున్న ప్రజలకు పార్టీలకు అతీతంగా సేవ చేయాలని తన తండ్రి తనకు చెప్పిన మాటలను వంద శాతం పాటిస్తున్నట్లు తెలిపారు.
భీమ్గల్ మండలంలో వేల మందికి లబ్ధి
భీమ్గల్ మండలంలోని పల్లికొండ, పిప్రి, బాచంపల్లి, మెండోరా, రహత్ నగర్, ముచ్కూర్, బెజ్జోరా, దేవక్కపేట్, బాబా నగర్, లింగాపూర్ చౌత్, దేవన్పల్లి, గంగరాయి, తాళ్లపల్లి, కారెపల్లి గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ కింద 539 మందికి రూ.2 కోట్ల 66 లక్షలు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ.942 మందికి రూ.9 కోట్ల 3 లక్షలు, ఆసరా పెన్షన్ల కింద 5,489 మందికి ప్రతి నెలా రూ.కోటీ 14 లక్షలు, రైతు బంధు కింద 6,743 మంది రైతులకు రూ.64 కోట్ల లబ్ధి జరిగిందన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ పంపించిన సందేశాన్ని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ సాంబారి మోహన్ చదివి వినిపించారు. అనంతరం పార్టీ శ్రేణులకు వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు భోజనాలు వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ మధుశేఖర్, పార్టీ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కన్నె సురేందర్, కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ గుణ్వీర్ రెడ్డి, చంద్రూనాయక్, శర్మా నాయక్, తుక్కాజీ నాయక్, శివసారి నర్సయ్య పాల్గొన్నారు.
కేసీఆర్, ప్రశాంత్ రెడ్డి అచ్చినంకనే అన్ని సౌలత్లు అయినయ్
ఆత్మీయ సమ్మేళనంలో భీమ్గల్ మండలంలోని పల్లికొండ సర్పంచ్ ఎనుపోతుల యమునమ్మ మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వచ్చాక తీరిన సమస్యలు, జరిగిన అభివృద్ధి, గతంలో పాలకులు పట్టించుకోని తీరు పై సూటిగా, ఘాటుగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె మాటల్లోనే..
‘కేసీఆర్, ప్రశాంత్ రెడ్డి వచ్చినంకనే మా ఊర్లో రోడ్లు మంచిగయినయ్.. మురికి కాల్వలయినయ్, మన ముందట సీసీ రోడ్లు వేసిండ్రు. నీళ్లకయితే పడ రాని గోస ఉండే. బిందెలు లైన్ల వెట్టుకుంటుంటిమి. దినాం ప్రేమతో ఉండే పక్క పక్క ఇంటోళ్లమే నీళ్ల కాడ లైన్ కాడికచ్చె సరికి తిట్టుకుంటుంటిమి. గసుంటి కష్టం పోయి ఇప్పుడు ఇంటికే నీళ్లత్తున్నయ్. నల్ల ఇప్పంగనే బకెట్ నిండి పోతున్నది.ఇంటికొక్క పింఛన్ వత్తున్నది. నెల నెలా రెండువేల పింఛన్ అత్తున్నది. కరెంటు తిప్పలయితే మొత్తంకే వోయినయ్. గందుకే కేసీఆర్ను, ప్రశాంత్ రెడ్డిని మనమంత మల్ల గట్టిగ నిలవడి గెలిపియ్యాలే. వోట్లప్పుడు కొందరు పైసల్ వట్టుకొని అత్తరు. వాళ్ల మాటలు నమ్మితే మల్ల మనకు పాత కష్టాలు అత్తయి సుమ. మనం బాగుండాలంటే ప్రశాంతన్న మల్ల గెలవాలే’ అని స్పష్టం చేశారు.